వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారత సంతతి వ్యక్తులు అక్కడి అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.ముఖ్యంగా రాజకీయ నాయకులుగా దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నారు.
అమెరికాలో కమలా హారిస్, వివేక్ మూర్తి, రాజా కృష్ణమూర్తి, అమీ బేరా, ప్రమీలా జయపాల్, యూకేలో ప్రీతి పటేల్, రిషి సునక్ ఇలా ఏ దేశంలో చూసినా ఉన్నత పదవుల్లో భారతీయులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.వీరితో పాటు మన దేశ మూలాలు కలిగిన ఎందరో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల చట్టసభల్లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అయితే ‘‘ ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా’’ అన్నట్లు ఏ స్థాయిలో వున్నా భారత మూలాలు మరిచిపోకుండా ఖండాంతరాలలో వున్నా మన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తున్నారు.
తాజాగా స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన పామ్ గోసల్ గురువారం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
తొలుత ఆమె సిక్కు మహిళగా రెండు చేతులను జోడించి ప్రార్ధన చేశారు.అనంతరం బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్కు విధేయత చూపిస్తూ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత సిక్కుల పవిత్ర గ్రంథమైన గుట్కా సాహిబ్కు నమస్కరించారు.వెస్ట్ స్కాట్లాండ్ నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున గెలిచిన గోసల్.
స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.కన్స్యూమర్ లాలో ఎంబీఏ చేసిన గోసల్కు ఆర్థికాభివృద్ధి, అంతర్గత పెట్టుబడి, వ్యాపారం, సాంస్కృతిక, చట్టపరమైన రంగాల్లో 30 ఏళ్ల అనుభవం వుంది.
కాగా గతేడాది భారత సంతతికి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ పశ్చిమ హామిల్టన్ నుంచి న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా న్యూజీలాండ్ పార్లమెంట్లో ఎంపీగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.తద్వారా న్యూజీలాండ్ చట్ట సభ చరిత్రలో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా, విదేశీ చట్ట సభల్లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన రెండవ వ్యక్తిగా గౌరవ్ రికార్డుల్లోకెక్కారు.హిమాచల్ ప్రదేశ్కు చెందిన 33 ఏళ్ల గౌరవ్ శర్మ కుటుంబం న్యూజీలాండ్లో స్థిరపడింది.
న్యూజీలాండ్లోని పశ్చిమ హామిల్టన్ పార్లమెంట్ స్థానంలో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై 4,386 ఓట్లతో గెలుపొందారు.