మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి భారతీయులు ఇటీవలి కాలంలో వరుసగా సింగపూర్లో మరణశిక్షకు గురవుతున్న సంగతి తెలిసిందే.డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులోనే భారత సంతతికి చెందిన నాగేంద్రన్ ధర్మలింగానికి సింగపూర్ కోర్టు మరణశిక్ష విధించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తన మానసిక స్థితి బాగా లేనందున క్షమాభిక్ష ప్రసాదించాలని ధర్మలింగం తరఫు న్యాయవాదులతో పాటు ఆన్లైన్లో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి.అయితే గతేడాది నాగేంద్రన్ కోవిడ్ బారినపడటంతో మానవతా దృక్పథంతో ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
తర్వాత ఏం జరగబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.ఈ క్రమంలోనే ధర్మలింగం మరణశిక్ష అప్పీల్కు సంబంధించి న్యాయస్థానం జనవరి 24న విచారణ జరపనుంది.
సింగపూర్ సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల ప్యానెల్ పిటిషన్ను విచారించనుంది.
తన మరణశిక్షను సవాల్ చేసేందుకు న్యాయపరమైన సమీక్ష ప్రక్రియను ప్రారంభించడానికి తనకు అనుమతిని నిరాకరించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నాగేంద్రన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
ఈ అప్పీల్ను చీఫ్ జస్టిస్ సుందరేశ్ మీనన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు ఆండ్రూ ఫాంగ్, జుడిత్ ప్రకాశ్, బెలిండా ఆంగ్, చావో హిక్ టిన్లతో కూడిన ప్యానెల్ విచారించనుందని ది స్ట్రెయిట్స్ టైమ్స్ శుక్రవారం కథనాన్ని ప్రచురించింది.నాగేంద్రన్ తరపున ప్రముఖ న్యాయవాది ఎం రవి వాదనలు వినిపించనున్నారు.
నిందితుడిని డ్రగ్స్ పెడ్లర్గా పరిగణించేంత మానసిక దృఢత్వం లేదని ఆయన అంటున్నారు.సైకియాట్రిస్ట్ల బృందం దీనిని గుర్తించిందని రవి చెబుతున్నారు.
ఇకపోతే.సింగపూర్కు 42 గ్రాముల హెరాయిన్ సరఫరా చేశాడని నాగేంద్రన్పై 2009లో అభియోగాలు నమోదయ్యాయి.అనంతరం అవి నిర్థారణ కావడంతో 2010లో ఆయనకు కోర్ట్ మరణశిక్ష విధించింది.దీంతో ఆయన న్యాయస్థానాల్లో పలుమార్లు అప్పీళ్లు చేసుకున్నప్పటికీ ఫలితం దక్కలేదు.చివరకు సింగపూర్ అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరినన్నప్పటికీ అక్కడా నిరాశే ఎదురైంది.11 ఏళ్ల క్రితం పడిన మరణశిక్ష గతేడాది నవంబర్ 10వ తేదీన అమలు కావాల్సి ఉంది.చివరకు నాగేంద్రన్కు కొవిడ్ సోకడంతో మరణశిక్ష మరోసారి వాయిదా పడింది.ఊహించని పరిణామాలు చోటుచేసుకోవడంతో ఈ కేసుపై ఆసక్తి పెరిగింది.దీంతో విచారణ నాడు హైకోర్టు ప్రాంగణం మొత్తం అంతర్జాతీయ మీడియా, స్థానిక ఆందోళనకారులతో కిక్కిరిసిపోయింది.మరి జనవరి 24న జరిగే విచారణ సందర్భంగా సుప్రీంకోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.