సైబర్ నేరానికి పాల్పడినందుకు గాను భారత సంతతి వ్యక్తికి యూకే కోర్టు జైలు శిక్ష విధించింది.అభయ్ సింగ్ అనే వ్యక్తి చట్టవిరుద్ధంగా సంపాదించిన ఆస్తులను దాచేందుకు ప్రయత్నించేందుకు కుట్ర పన్నినట్లు నేషనల్ క్రైమ్ ఏజెన్సీ దర్యాప్తులో తేలింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో నేరాన్ని అంగీకరించడంతో గత వారం బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు అతనికి మూడు సంవత్సరాల నాలుగు నెలల శిక్ష విధించింది.
ఈ ఏడాది ప్రారంభంలో మెట్రోపాలిటిన్ పోలీస్ సెంట్రల్ స్పెషలిస్ట్ క్రైమ్ యూనిట్ అధికారులు ఇతని వద్ద డ్రైవింగ్ లైసెన్సులు, బ్యాంక్ కార్డులు, నగదు పుస్తకాలు వంటి అనేక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
అభయ్ సింగ్ మోసపూరిత కుట్రపై నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన ఉస్మాన్ ఖాన్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇతనితో పాటు ఈ కుట్రలో పాలు పంచుకున్న 56 ఏళ్ల నవీద్ పాషాకు కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది.
ఈ క్రిమినల్ ముఠా 2016 నుంచి 2019 సంవత్సరాల మధ్య కాలంలో హానికరమైన సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్లలోకి చొరబడింది.దీని సాయంతో వ్యక్తులు, వ్యాపారుల బ్యాంక్ ఖాతాలను యాక్సెస్ చేసేవారని యూకే పోలీసులు తెలిపారు.ఇది చాలా క్లిష్టమైన కేసు అని సైబర్ నేరం, మనీలాండరింగ్ కలగలసిన వ్యవహారమని నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి చెందిన సైబర్ క్రైమ్ యూనిట్ అధికారి ఫిల్ లారట్ తెలిపారు.ఖాన్ అతని అనుచరులు నెట్వర్క్గా ఏర్పడి బాధితుల నుంచి దొంగిలించిన వేలాది పౌండ్లను మరో చోటికి తరలించేవారని ఆయన తెలిపారు.
నిందితులు తమ ఆధీనంలో ఉన్న ఇతర మ్యూల్ ఖాతాలకు డబ్బును బదిలీ చేసేందుకు గాను బాధితులను నగదు ఉపసంహరించుకునేలా చేసేవారని లారట్ పేర్కొన్నారు.