సూపర్ సైక్లోన్ శాండీ తర్వాత జరిగిన విధ్వంసంలో దెబ్బతిన్న సబ్వే మరమ్మత్తుల పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి న్యూయార్క్ ప్రజా రవాణా విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి తన నేరాన్ని అంగీకరించాడు.మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (ఎంటీఏ) మేనేజర్గా పనిచేసిన 59 ఏళ్ల పరేశ్ పటేల్ ఫిబ్రవరిలో దర్యాప్తు అధికారులకు లొంగిపోయాడు.
ఈ అవకతవకలకు సంబంధించి ఆయన నేరాన్ని అంగీకరించడంతో గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడేయ్యే అవకాశం ఉందని న్యూయార్క్ దక్షిణ జిల్లా అటార్నీ జెఫ్రీ బెర్మన్ తెలిపారు.
పటేల్ ఎంటీఏలో ప్రోగ్రామ్ మేనేజర్ హోదాలో కాంట్రాక్టులు ఇవ్వడం, వాటని పర్యవేక్షిస్తారు.
సూపర్ సైక్లోన్ శాండీ విరుచుకుపడటంతో సబ్వే మరమ్మత్తుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.జూన్ 2014లో పటేల్తో పాటు మరో ఎంటీఏ ఉద్యోగితో కలిసి ‘‘సత్కీర్తి కన్సల్టింగ్ ఇంజనీరింగ్’’ అనే ఇంజనీరింగ్ కన్సల్టింగ్ సంస్థను స్థాపించారు.
ఫిబ్రవరి 2015లో జోరలెమోన్ ట్యూబ్ సబ్వే పునరావాస ప్రాజెక్ట్ సబ్ కాంట్రాక్ట్ పనులు సత్కీర్తికి లభించాయి.ఈ ప్రాజెక్ట్ను పటేల్ ఎంటీఏలో తన హోదాలో పర్యవేక్షించేవాడు.
సబ్ కాంట్రాక్ట్ కోసం బిడ్ వేయడంతో పాటు పనులు నిర్వహించిన సత్కీర్తి సంస్థలోని సాంకేతిక ఉద్యోగులు, పటేల్ స్నేహితుడు ఇంజనీరింగ్ వ్యవహారాల్లో ఎలాంటి అనుభవం, అర్హతలు లేనివారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
2016లో ఫెడరల్ అధికారులు సత్కీర్తికి ఇచ్చిన ఒప్పందంపై దర్యాప్తు ప్రారంభించారు.ఈ సంస్థ ఉద్యోగులను పటేల్తో గల సంబంధంపై ఆరా తీశారు.ఈ మొత్తం వ్యవహారంపై అటార్నీ బెర్మన్ మాట్లాడుతూ… శాండీ విధ్వంసం నేపథ్యంలో పటేల్ ఓ సంస్థను స్ధాపించి, మరమ్మత్తు పనులను చేజిక్కించుకున్నాడని తెలిపారు.
తద్వారా పరేష్, అతని కుటుంబం లాభం పొందారని, ఈ కుంభకోణం బయటకు పొక్కడంతో పరేశ్ పటేల్ సాక్ష్యాలను నాశనం చేశాడని చెప్పారు.అంతేకాకుండా సాక్ష్యులను ప్రలోభ పెట్టడంతో పాటు స్థానిక దర్యాప్తు అధికారులను సైతం తన పలుకుబడితో అడ్డుకున్నారని తేలింది.
ఎంటీఏ అవినీతిపై దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నాలు దేశంలోని అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని ప్రమాదంలోని నెడతాయని బెర్మన్ వెల్లడించారు.