పిచ్చి ప్రేమ మనిషిని ఎంతకైనా తెగించేలా చేస్తుంది.ప్రేమించిన వారి కోసం చనిపోవడమో లేదంటే ప్రేమించిన వారినే చంపేయడం వరకు ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చు.
దుబాయ్లో రెండో కోవకు చెందిన సంఘటన జరిగింది.ప్రియురాలే లోకంగా బతికన ఓ యువకుడు.
ఆమెను పిచ్చిగా ఆరాధించాడు.తనను కాదని మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానించిన ఆ ప్రియుడు మృగంలా మారాడు.
ప్రాణాలకంటే మిన్నగా ప్రేమించిన ప్రియురాలి ప్రాణాలే తీసేశాడు.అక్కడితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని కారులో తన పక్కన పెట్టుకుని డ్రైవింగ్ చేశాడు.
గతేడాది జూలైలో జరిగిన ఈ ఘటనలో నిందితుడు, బాధితురాలు ఇద్దరూ భారతీయులే కావడం గమనార్హం.ఓ 27 ఏళ్ల యువకుడు యూఏఈలో నివసిస్తూ, అక్కడే ఉంటున్న భారతీయ యువతితో ప్రేమలో పడ్డాడు.
సాఫిగా సాగిపోతున్న వీరి ప్రేమాయణంలో అనుమానం చిచ్చు పెట్టింది.తన ప్రేయసి తనతో పాటు మరో యువకుడితోనూ మాట్లాడుతోందని అనుమానం పెంచుకున్న ఆ యువకుడు ఆమెతో తరచూ గొడవ పడేవాడు.
ఈ విషయంపై ఆమెకు నచ్చజెప్పుదామని గతేడాది జూలైలో కారులో లాంగ్ డ్రైవ్కు ప్లాన్ చేశాడు.
ఓ చోట కారు ఆపి మాట్లాడుకుంటుండగా మళ్లీ గొడవ జరిగింది.
ఈ సమయంలో తీవ్ర ఆవేశానికి గురైన యువకుడు.తన వెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోశాడు.
అక్కడితో ఆగకుండా శవాన్ని డ్రైవింగ్ సీట్లో తన పక్కన పెట్టుకుని 45 నిమిషాల పాటు ప్రయాణించి, ఓ హోటల్ వద్ద భోజనం చేశాడు.అనంతరం మళ్లీ తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ యువకుడు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.
ఒంటి నిండా రక్తపు మరకలతో ఉన్న అతన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు.తాను హత్య చేసినట్లు నిందితుడు చెప్పాడని, కారులో పరిశీలించగా ముందు సీట్లో యువతి మృతదేహం.
వెనుక సీట్లో హత్యకు ఉపయోగించిన కత్తి ఉన్నాయని పోలీసులు తెలిపారు.అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జైలుకు తరలించారు.
ఈ కేసుపై గత ఆదివారం విచారణ జరిపిన న్యాయస్థానం త్వరలో నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది.