ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి యూకే కోర్టు మూడున్నర సంవత్సరాల జైలుశిక్షను విధించింది.హౌన్స్లో ప్రిన్స్ రీజెంట్ రోడ్లో నివసిస్తున్న 36 ఏళ్ల నికుంజ్కుమార్ వైద్ మైనర్ బాలికపై రెండు సార్లు వేధింపులకు పాల్పడిన నేరం కింద గతేడాది డిసెంబర్లో లండన్లోని ఐల్వర్త్ క్రౌన్ కోర్టులో విచారణ జరిగింది.
పశ్చిమ లండన్లోని తన ఇంటి వద్ద రెండు సందర్భాలలో వైద్ ఆ బాలికను అసభ్యంగా తాకినట్లు తేలింది.ఈ రెండు సందర్భాల్లోనూ ఇంట్లో పెద్దలు లేనప్పుడు వైద్ ఆ అమ్మాయిని లక్ష్యంగా చేసుకున్నాడు.
రెండవసారి ఇలాంటి చర్యకు పాల్పడినప్పుడు ఇది ‘‘ టాప్ సీక్రెట్’’ అని ఎవరికీ చెప్పొద్దని ఆ బాలికతో అన్నట్లుగా రుజువైంది.అయితే ఆ బాలిక తన తల్లితో జరిగినదంతా చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నికుంజ్ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే వైద్ తనపై వచ్చిన ఆరోపణలు ఖండించడంతో పాటు బాలిక తనపై తప్పుడు వాదనలు చేసిందని మండిపడ్డాడు.దర్యాప్తు సందర్భంగా బాధితురాలికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన అధికారుల నుంచి స్పెషలిస్ట్ కౌన్సెలింగ్ ఇప్పించామని మెట్రోపాలిటిన్ పోలీస్ వెస్ట్ ఏరియా సేఫ్ గార్డింగ్ టీమ్ తెలిపింది.నికుంజ్కుమార్ ఒక అవకాశవాది అని అతను ఇతరుల విశ్వాసాన్ని పొందినట్లే పొంది పరిస్ధితులను తనకు అనుకూలంగా మలచుకున్నాడని… అంతేకాకుండా బాలికపై రెండు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మెట్ పోలీస్ విభాగానికి చెందిన ఎమ్మా రోజర్స్ అన్నారు.
పోలీసులకు సమాచారం అందించడంతో పాటు ఈ దర్యాప్తును ముగించడానికి ధైర్యంగా సహకరించిన ఆ బాలిక, ఆమె కుటుంబాన్ని ఆమె ప్రశంసించారు.