లా ఎన్ఫోర్స్మెంట్ అధికారిపై దాడికి పాల్పడిన భారత సంతతికి చెందిన వ్యక్తికి 11 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది సింగపూర్ కోర్ట్. నిందితుడిని విక్నేశ్వరన్ శివన్గా గుర్తించారు.
కాన్బెర్రా లింక్లోని ఖాళీ డెక్లోని ఫ్లాట్ల వద్ద సిగరెట్ తాగినందుకు శివన్కు బాధిత అధికారి నవంబర్ 9, 2020న నోటీసులు ఇచ్చినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.ఈ క్రమంలో సదరు అధికారి మొహ్మద్ అఫీక్ మొహమ్మద్ జమీల్పై శివన్ పదునైన ఆయుధంతో దాడికి దిగారు.
ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన జమీల్ దాదాపు 141 రోజుల పాటు ఆసుపత్రిలోనే వున్నాడు.ఆయన పూర్తిగా కోలుకుంటాడని, కానీ ఆయన శరీరంపై గాయాల తాలూకు మచ్చలు వుంటాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ కేసుకు సంబంధించి విక్నేశ్వరన్ ఈ ఏడాది అక్టోబర్లో ఏడు అభియోగాలను అంగీకరించాడు.ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేయడం, ప్రభుత్వోద్యోగిని గాయపరచడం వంటివి ఇందులో ఉన్నాయి.తాజాగా శిక్ష విధించే ముందు జిల్లా న్యాయమూర్తి మార్విన్ బే కీలక వ్యాఖ్యలు చేశారు.అధికారుల పట్ల శివన్ ధిక్కారాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు.
కాగా.ఇటీవల తన మాజీ భార్యకు కాబోయే భర్త ఇంటి వద్ద నిప్పు పెట్టిన ఓ భారత సంతతికి చెందిన వ్యక్తికి న్యాయస్థానం జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
వివరాల్లోకి వెళితే… నిందితుడిని సురెంధిరన్ సుగుమారన్గా గుర్తించారు.ఇతను అగ్నిప్రమాదం వల్ల నష్టం కలుగుతుందని తెలిసి కూడా ఉద్దేశ్యపూర్వకంగా ఈ నేరానికి పాల్పడ్డాడని కోర్ట్ దృష్టికి వచ్చింది.దీనిపై అతను నేరాన్ని అంగీకరించడంతో ఈ ఏడాది అక్టోబర్లో సురెంధిరన్ను న్యాయస్థానం దోషిగా తేల్చినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తా సంస్థ నివేందించింది.తుది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి యూజీన్ టీయో మాట్లాడుతూ.అతని చర్య చుట్టుపక్కల నివసించేవారిని ప్రమాదంలో పడేస్తుందన్నారు.కాగా… సింగపూర్ చట్టాల ప్రకారం ఆస్తికి ఉద్దేశ్యపూర్వకంగా నష్టం కలిగించిన వారికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.