భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు మూడు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభిస్తోంది.
అయితే రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాతి నుంచి పరిస్థితులు మారిపోయాయి.రైతుల ఆందోళన ముసుగులో ఖలీస్తానీ వేర్పాటు వాదులు దేశ విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తున్నారంటూ నిఘా వర్గాలు సంచలన నివేదికను బయటపెట్టాయి.
దీనికి తోడు రైతులకు మద్ధతుగా ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్ ట్వీట్ చేసిన ‘‘టూల్ కిట్ ’’ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.రైతుల ఆందోళనకు మద్ధతుగా కెనడా, అమెరికాలలో కొందరు ఖలీస్తానీ వేర్పాటు వాదులు ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు.
అయితే వారికి పోటీగా పలువురు ఎన్ఆర్ఐలు భారత ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.
ఇక దేశం కానీ దేశంలో తోటి భారతీయులకు తోడుగా వుండాల్సింది పోయి.
వారిపై దాడులకు పాల్పడిన ఓ భారత సంతతి యువకుడిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడిని 24 ఏళ్ల విశాల్ జూడ్గా గుర్తించారు.సిక్కు కమ్యూనిటీని టార్గెట్ చేసుకుని అతను పదే పదే దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.సిడ్నీలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన పరామట్టలోని డిక్సన్ స్ట్రీట్లో నివసిస్తున్న జూడ్ను శుక్రవారం న్యూసౌత్ వేల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
విశాల్కు బెయిల్ రాకపోవడంతో అతనిని పోలీసులు శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.గతేడాది సెప్టెంబర్ నుంచి పరామట్ట పోలీస్ ఏరియా కమాండ్ అధికారులు.హారిస్ పార్క్లో జరిగిన అనేక సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నారు.గతేడాది సెప్టెంబర్ 16 రాత్రి 8.30 గంటల సమయంలో బ్రిస్బేన్ వీధిలో ఒక వ్యక్తిపై ఐదుగురు వ్యక్తుల గుంపు దాడి చేసింది.ఈ ఘటనలో ఓ వ్యక్తి బేస్ బాల్ బ్యాట్తో బాధితుడి తలపై పదే పదే మోదాడు.
తీవ్రగాయాలు కావడంతో బాధితుడిని చికిత్స కోసం వెస్ట్మీడ్ ఆసుపత్రికి తరలించారు.
ఇక మరో ఘటనలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో మారియన్ స్ట్రీట్ వెంట రేంజ్ ఓవర్ నడుపుతున్న వ్యక్తిని ఐదుగురు వ్యక్తుల బృందం అడ్డగించి అతనిపై కర్రలు, ఇతర ఆయుధాలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.అదే నెల 28వ తేదీన రాత్రి 10.15 గంటల ప్రాంతంలో కెండల్ స్ట్రీట్లో వాహనంలో ప్రయాణిస్తున్న యువకులపై పది మంది సభ్యులు గల గుంపు దాడికి పాల్పడింది.ఈ ఘటనలో వాహనం సైతం ధ్వంసమైంది.
కారులో వున్న వారంతా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న వారే.సిక్కు మతానికి చెందినందువల్లే తమపై దాడి జరిగిందని బాధితులు చెబుతున్నారు.
వీరంతా హారిస్ పార్క్ ప్రాంతంలో వున్న ఓ భారతీయ రెస్టారెంట్లో పార్టీ చేసుకుని తిరిగి వస్తున్నారు.ఈ మూడు ఘటనల్లో విశాల్ జూడ్కు ప్రమేయం వుందని పోలీసులు చెబుతున్నారు.
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల నేపథ్యంలో ప్రవాసులు రెండు వర్గాలుగా చీలిపోయారు.వీరిలో ఒక వర్గం మోడీ సర్కార్కు, మరో వర్గం రైతులకు మద్ధతు పలుకుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో సిక్కు యువకులపై జరిగిన దాడిని తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు.