భారత సంతతికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త గీతా సిద్ధూ రాబ్ లండన్ మేయర్ అభ్యర్ధి బరి నుంచి తప్పుకున్నారు.23 ఏళ్ల క్రితం యూదులపై ఆమె నోరుపారేసుకోవడమే ఇప్పుడు చిక్కుల్ని తెచ్చిపెట్టింది.గీత యూకేలో సేంద్రీయ ఆహారం, జ్యూస్ సంబంధిత ఉత్పత్తులను అందించే సంస్థ నోష్ డిటాక్స్ వ్యవస్థాపకురాలు లండన్ మేయర్ ఎన్నికల్లో భాగంగా లిబరల్ డెమొక్రాట్ అభ్యర్ధిగా షార్ట్ లిస్ట్ అయ్యారు.
అయితే 1997 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆమె యూదు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు సాక్ష్యాధారాలు లభించడంతో పార్టీ నుంచి గీతాను సస్పెండ్ చేశారు.
దీనిపై స్పందించిన గీత నాటి తన ప్రవర్తన పట్ల క్షమాపణలు చెప్పారు.తన చర్యల కారణంగా ఎవరి మనస్సులైనా నొచ్చుకుని వుంటే తనను మన్నించాలని కోరారు.అలాగే సమాజంలో జాత్యహంకారానికి, యాంటిసెమిటిజానికి తావు లేదన్నారు.
23 సంవత్సరాల క్రితం బ్లాక్బర్న్లో కన్జర్వేటివ్ పార్టీ సార్వత్రిక ఎన్నికల అభ్యర్ధిగా, ప్రస్తుత లేబర్ ఎంపీ జాక్ స్ట్రాతో పోటీపడ్డారు.ఆ సమయంలో గీత మాట్లాడుతూ… జాక్ స్ట్రా యూదుడని ఆయనకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు.23 సంవత్సరాల నాటి ఈ ఘటన తర్వాత తన నుంచి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాలేదని గీత పేర్కొన్నారు.కాగా, లండన్ మేయర్ ఎన్నిక ఈ ఏడాది మేలో జరగాల్సి వుంది.కానీ కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడంతో అంతరాయం ఏర్పడటంతో 2021 మేకు వాయిదా పడింది.
ప్రస్తుత మేయర్ సాదిఖ్ ఖాన్తో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్ధి షాన్ బెయిలీ తలపడుతున్నారు.గతంలో పార్టీ ఎంపిక చేసిన సియోభన్ బెనిటా రేసు నుంచి వైదొలగారు.
తాజాగా సిద్ధూ రాబ్ సైతం సస్పెండ్ కావడంతో పార్టీ ఇప్పుడు కొత్త అభ్యర్ధి వేటలో పడింది.గీత సస్పెన్షన్ గురించి లిబరల్ డెమొక్రాట్ పార్టీ అధికారికంగా ధ్రువీకరించింది.
ఆమె స్థానంలో మరో అభ్యర్ధిని అన్వేషిస్తున్నట్లుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.