అమెరికాలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు.ఇప్పటికే ఇద్దరు భారతీయులను పొట్టనబెట్టుకున్న దుండగులు తాజాగా మరోకరిని కాల్చి చంపారు.
జార్జియా రాష్ట్రం తూర్పు కొలంబస్లోని బ్యూనో విస్టా రోడ్లో ఈ ఘటన జరిగింది.సోమవారం తన కుమార్తె మూడవ పుట్టినరోజును జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా భారత సంతతి వ్యక్తిని అగంతకుడు కాల్చిచంపాడు.
మృతుడిని పిరమిడ్ గ్యాస్ స్టేషన్ యజమాని అమిత్ కుమార్ పటేల్గా గుర్తించారు.సోమవారం ఉదయం 10.09 గంటలకు బ్యాంక్ వెలుపల ఈ ఘటన జరిగినట్లు ముస్కోగీ కౌంటీ డిప్యూటీ కరోనర్ చార్లెస్ న్యూటన్ ప్రకటించారు.ఘటన జరిగిన ప్రదేశానికి కొద్దిమీటర్ల దూరంలోనే కొలంబస్ పోలీస్ డిపార్ట్మెంట్ కార్యాలయం వుంది.
అమిత్ కుమార్ పటేల్ బ్యాంక్ ఎంట్రీ పాయింట్ వద్ద ఆ వారానికి సంబంధించి నగదును డిపాజిట్ చేస్తుండగా .అగంతకుడు కాల్పులు జరిపి డబ్బుతో పారిపోయినట్లుగా తెలుస్తోంది.డబ్బు డిపాజిట్ గురించి ముందే తెలుసుకున్న నిందితుడు మృతుడిని అనుసరించి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు.
ఇక గత నెల 18న డల్లాస్ నగరంలో ఓ కేరళవాసిని దొంగ కాల్చి చంపిన సంగతి తెలిసిందే.
మృతుడిని ఇక్కడి మెస్కైట్ స్ట్రిప్ షాపింగ్ సెంటర్లో బ్యూటీ సప్లై స్టోర్ నడుపుతున్న సాజన్ మాథ్యూస్ (56) అలియాస్ సాజీగా గుర్తించారు.ఆ ఆగాంతకుడు దుకాణంలోకి ప్రవేశించి కౌంటర్ వద్ద వున్న సాజీపై కాల్పులు జరిపాడు.
స్ట్రిప్ షాపింగ్ సెంటర్లోని నార్త్ గాల్లోవే అవెన్యూలోని 1800 బ్లాక్లోని విక్టోరియాస్ బ్యూటీ సప్లై సెంటర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మాథ్యూస్ని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.
కేరళ రాష్ట్రం కోజెంచేరికి చెందిన మాథ్యూస్ 2005లో కువైట్ నుంచి యూఎస్కి వలస వచ్చారు.మాథ్యూస్కి భార్య మినీ, ఇద్దరు పిల్లలు వున్నారు.
మినీ డల్లాస్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్లో నర్స్గా పనిచేస్తున్నారు.అయితే అర్థరాత్రి గడిచినా నిందితుడు ఎవరన్నది పోలీసులు గుర్తించలేదు.
మరోవైపు మాథ్యూస్ దారుణహత్య డల్లాస్లోని మలయాళీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
అలాగే తెలుగు రాష్ట్రాలకు చెందిన అరవపల్లి శ్రీరంగ (54)ను కూడా గత నెలలో దుండగుడు కాల్చి చంపిన సంగతి విదితమే.
ఆయన అమెరికాలో ఆరెక్స్ ల్యాబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అలాగే క్యాంప్ టెక్ గ్లోబల్ సంస్థ ప్రతినిధిగా పనిచేస్తున్నారు.న్యూజెర్సీ లోని ప్లెయిన్స్బరోలో శ్రీరంగ నివాసం ఉంటున్నారు.
అరవపల్లి 2014 నుంచి ఆరెక్స్ లేబోరేటరీస్కు సారథిగా వ్యవహరిస్తున్నారు.హత్యకు ముందు పెన్సిల్వేనియాలోని పార్క్స్ క్యాసినోలో అరవపల్లి శ్రీరంగ 10,000 డాలర్ల పందెం గెలిచినట్లు అమెరికన్ మీడియా కథనాలను ప్రచురించింది.
అంత పెద్ద మొత్తాన్ని గెలవడం గమనించిన జాన్ అనే దుండగుడు.శ్రీరంగను ఇంటి వరకు అనుసరించాడు.
అరవపల్లి ఇంటిలోపలికి వెళ్లిన తర్వాత జాన్ రీడ్ బ్యాక్డోర్ను పగులగొట్టి లోనికి ప్రవేశించాడు.ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో శ్రీరంగను జాన్ కాల్చిచంపినట్లుగా పోలీసులు వెల్లడించారు.