దేశంలో వివిధ రంగాల్లో అద్భుత విజయాలు సాధించడంతో పాటు సమాజానికి ఇతోధికంగా సాయం చేసిన 1,239 మందితో యూకే ప్రభుత్వం న్యూఇయర్ ఆనర్స్ లిస్ట్ 2021ని విడుదల చేసింది.వీరిలో భారత సంతతికి చెందిన ఫ్రంట్ లైన్ కార్యకర్తలు, వైద్యులు, కళాకారులు, విద్యావేత్తలు వున్నారు.
ఈ లిస్ట్లో ఫార్ములా 1 ఛాంపియన్ లూయిస్ హామిల్టన్, బ్రిటీష్ నటి షీలా హన్కాక్ వున్నారు.అలాగే అవార్డు దక్కించుకున్న వారిలో బ్లాక్, ఆసియన్ లేదా మైనారిటీ జాతి నేపథ్యం నుంచి వచ్చిన వారే అధికం (14.2 శాతం).
లండన్లో వయోజన విద్యకు తోడ్పడినందుకు సుట్టన్ కాలేజీ ప్రిన్సిపాల్ దీపాన్విత గంగూలీ, బ్రిటీష్ ఇండియన్ టెలివిజన్ యాంకర్, బాలీవుడ్ నటి నినా వాడియాలకు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ (ఓబీఈ)ను ప్రదానం చేశారు.
పోర్ట్స్ మౌత్ హాస్పిటల్లో కన్సల్టెంట్, ఎండోక్రినాలజిస్ట్ ప్రొఫెసర్ పార్థ సారథి కర్, వ్యాపారవేత్త లార్డ్ దిల్జిత్ రానా, అపాచీ ఇండియన్గా ఖ్యాతి తెచ్చుకున్న వెస్ట్ మిడ్లాండ్స్కు చెందిన సంగీతకారుడు స్టీవెన్ కపూర్, బీఏపీఎస్ స్వామి నారాయణ సన్స్థ ట్రస్టీ సంజయ్ జయేంద్ర, సిక్కు ఫుడ్ బ్యాంక్ వ్యవస్థాపకుడు చరణ్ దీప్ సింగ్, ఆకాశ్ ఒడెడ్రా సహ వ్యవస్థాపకుడు ఆనంద్ భట్, డాక్టర్ ఆల్కా సూరజ్ ప్రకాశ్ అహూజా, బోల్టన్లోని డయాబెటిస్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్నోవ్ దీప్ సింగ్ భరాజ్, అనిత గోయల్, భవెన్ పాఠక్ వున్నారు.ఈ లిస్ట్లో ప్రభుత్వ రంగానికి చెందిన అగ్నిమాపక సిబ్బంది, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు 14.8 శాతం మంది ఉన్నారు.
నేషనల్ హెల్త్ సర్వీస్ను రక్షించడానికి ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఈ ఏడాది ఎంతోమంది త్యాగాలు చేశారని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.2021 న్యూ ఇయర్ ఆనర్స్ వారి అంకిత భావానికి ధన్యవాదాలు తెలిపారు.కొత్త సంవత్సరంలో కరోనా మహమ్మారితో పోరాడటానికి అవార్డు గ్రహీతలు ప్రేరణగా నిలుస్తారని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు.