ప్రజలను మోసం చేసిన కుంభకోణంలో దోషిగా తేలిన భారత సంతతి యువకుడికి 3,91,680 పౌండ్లు చెల్లించాలని లేని పక్షంలో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించాలని యూకే కోర్ట్ ఆదేశించింది.వివరాల్లోకి వెళితే.31 ఏళ్ల చరణ్జిత్ సంధు.యూకేలోని వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
తద్వారా 1,704,564 అక్రమంగా సంపాదించినట్లు యూకే క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) సోమవారం న్యాయస్థానానికి తెలిపింది.విచారణ అనంతరం చరణ్జిత్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం థేమ్స్ వ్యాలీ పోలీస్, లండన్ పోలీసుల సహకారంతో అతని ఆస్తులను జప్తు చేసి పరిహారాన్ని కోర్టుకు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
సంధు కోర్ట్కు సమర్పించిన లెక్కల ప్రకారం అతని ఆస్తిని 3,91,680 పౌండ్లుగా నిర్ణయించారు.వీటిలో అందుబాటులో వున్న ముఖ్యమైన ఆస్తుల్లో 72,000 పౌండ్ల విలువైన రోజ్ గోల్డ్ పటేక్ ఫిలిప్ వాచ్, 22,000 పౌండ్ల విలువైన ఆడెమర్స్ పిగ్యుట్ వాచ్, 4000 పౌండ్ల విలువైన రోలెక్స్ వాచ్ వున్నాయి.
అయితే చరణ్జిత్ తన ఆస్తులలో కొన్నింటిని దాచేందుకు ప్రయత్నించగా.దర్యాప్తు బృందాలు 2,00,000 పౌండ్ల విలువైన ఆస్తులను కొనుగొన్నాయి.తద్వారా అతను అందుబాటులో వున్న ఆస్తుల ద్వారా పరిహారం చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది.
ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బును చరణ్జిత్ ఎక్కువగా విలాసాలకు ఖర్చు చేశాడు.
లగ్జరీ హాలిడే విల్లాను అద్దెకు తీసుకోవడంతో పాటు వాచ్లు, ఆభరణాలు, డిజైనర్ దుస్తులు తదితరాల కోసం 9,000 పౌండ్లు ఖర్చు చేసినట్లు ఆధారాలు వున్నాయి.
చరణ్జిత్ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని కోల్డ్ కాలింగ్, అధిక పీడన అమ్మకపు వ్యూహాల ద్వారా మోసాలకు పాల్పడ్డాడు.బాధితులను ఒకటికంటే ఎక్కువసార్లు లక్ష్యంగా చేసుకున్నట్లు సీపీఎస్ ప్రాసిక్యూటర్ క్లైర్ బెన్నెట్ అన్నారు.నేరం నుంచి లాభం పొందిన వ్యక్తులను సీపీఎస్ వదిలిపెట్టదని… 2019-20లో ఈ తరహా నేరాల్లో తాము 100 మిలియన్ పౌండ్లకు పైగా వసూలు చేసినట్లు బెన్నెట్ తెలిపారు.
లండన్ పోలీసుల దర్యాప్తులో హర్మాన్ రాయిస్ లిమిటెడ్, కేండ్రిక్ జాలే లిమిటెడ్ ద్వారా కార్బన్ క్రెడిట్ అమ్మకాలతో ప్రజలను మోసం చేసేందుకు కుట్ర పన్నినట్లు చరణ్జిత్ డిసెంబర్ 20, 2017లో నేరాన్ని అంగీకరించాడు.ఈ నేరాలకు సంబంధించి అతనికి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
ఇక ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ) కేసుకు సంబంధించి డిసెంబర్ 11న మోసపూరిత వాటా అమ్మకపు పథకంలో పాల్గొనేలా ప్రజలను ఆకర్షించిన నేరంలోనూ సంధు దోషిగా నిర్ధారించబడ్డాడు.మొత్తం మీద మోసం, మనీలాండరింగ్ కుట్రలో అతను దోషిగా తేలాడు.
చట్టపరమైన మార్గదర్శకాల ప్రకారం నేరస్తుడు కోర్ట్ జప్తు ఉత్తర్వును సకాలంలో చెల్లించడానికి నిరాకరించిన పక్షంలో సీపీఎస్… ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కింద 14 సంవత్సరాల జైలు శిక్ష విధించమని కోర్టును కోరవచ్చు.అతను అప్పు పూర్తిగా చెల్లించేవరకు సీపీఎస్కు ఈ న్యాయపరమైన అధికారం వుంది.
అంతేకాదు అప్పుపై 8 శాతం వడ్డీని కూడా వసూలు చేసుకోవచ్చు.