ఎండ, వాన, చలిని లెక్కచేయకుండా కంటి మీద కునుకు లేకుండా దేశ రక్షణ విధుల్లో పాల్గొనే సైనికుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.త్యాగానికి, క్రమశిక్షణకు మారుపేరుగా కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తుంటారు.
కానీ తోటి వారికి స్పూర్తిగా నిలవాల్సిందిపోయి.మద్యం సేవించి వాహనాన్ని నడిపాడో మాజీ సైనికాధికారి.
దీనిపై కన్నెర్ర చేసిన కోర్టు శిక్షను వేసింది.వివరాల్లోకి వెళితే.
భారత సంతతికి చెందిన ఓ మాజీ సైనికాధికారి సింగపూర్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడు.దీనికి గాను ఆయనకు ఒక వారం జైలు శిక్ష విధించింది కోర్ట్.
అయితే తన రిటైర్మెంట్ బెనిఫెట్స్ పోతాయని గ్రహించిన సదరు అధికారి.సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోగా న్యాయస్థానం కొట్టివేసింది.
సింగపూర్ సైనిక దళాల్లో పనిచేసిన ఎం రవీంద్రన్ అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడిపినందుకు కోర్టు ఆయనకు వారం జైలు శిక్ష విధించింది.అయితే జైలు శిక్షకు బదులుగా తనకు జరిమానా విధించాలని రవీంద్రన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.తాను జైలులో వుంటే పదవీ విరమణ తర్వాత వచ్చే 2,73,694 సింగపూర్ డాలర్లు (భారత కరెన్సీలో 1.5 కోట్ల రూపాయలు)ను కోల్పోయే ప్రమాదం వుందని తెలిపారు.
దీనిపై సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.ఈ సందర్భంగా రవీంద్రన్ వాదనను తోసిపుచ్చింది.శిక్ష విధించే క్రమంలో నేరస్తుడు ఆ తర్వాత ఎదుర్కొనబోయే పరిణామాలను తాము పరిగణనలోనికి తీసుకోలేమని న్యాయమూర్తి తేల్చిచెప్పారు.నేరస్థుడి శిక్షను తాము తగ్గించినట్లయితే .అది కొంతమంది వ్యక్తుల పట్ల అనుకూలంగా వ్యవహరించడానికి దారి తీస్తుందని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.అయితే ఏడు రోజులు కాకుండా ఐదు రోజుల శిక్షను ఖరారు చేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని ది స్ట్రయిట్స్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
2018 సెప్టెంబర్ 9 అర్ధరాత్రి రవీంద్రన్ తన స్నేహితులతో కలిసి బీరు తాగి కారులో ఇంటికి వెళ్తున్నాడు.ఈ క్రమంలో ఆయన కారు అదుపుతప్పి డివైడర్ మీదకు దూసుకెళ్లింది.ఈ సమయంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు.బ్రీతింగ్ ఎనలైజర్ టెస్ట్ చేయగా అందులో రవీంద్రన్ మద్యం సేవించినట్లు తేలింది.అనంతరం డివైడర్ రెయిలింగ్ మరమ్మత్తుల కోసం రవీంద్రన్ 1,438.50 డాలర్ల బిల్లును చెల్లించి, తాను మద్యం తాగి వాహనాన్ని నడిపినట్లు అంగీకరించాడు.