ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు అక్కడి రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.కమలా హారిస్, రాజా కృష్ణమూర్తి, తులసి గబార్డ్, వివేక్ మూర్తి, ప్రీతి పటేల్, రిషి సునక్ వంటి నేతలు ఆయా దేశాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తున్నారో ప్రతి రోజూ చూస్తూనే వున్నాం.
తాజాగా న్యూజిలాండ్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ (33) ఎంపీగా గెలిచారు.అంతేనా.
ఆయన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
‘‘ ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము’’ అన్న రాయప్రోలు సుబ్బారావు మాటను అక్షరాల నిజం చేశారు గౌరవ్.
న్యూజిలాండ్లో ఉంటున్నా.ఆయన భారతీయ సంప్రదాయానికి ఎంతో విలువనిస్తారు.తాజాగా దేశ పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ తాను అసలు సిసలు భారతీయుడినని రుజువు చేసుకున్నారు.తొలుత న్యూజిలాండ్ అధికారిక భాష మోరీలో ప్రమాణస్వీకారం చేసిన గౌరవ్.
ఆ తర్వాత భారతదేశానికి చెందిన సంస్కృతంలోనూ ప్రమాణం చేశారు.
తద్వారా న్యూజీలాండ్ చట్ట సభ చరిత్రలో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా .విదేశీ చట్ట సభల్లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన రెండవ వ్యక్తిగా గౌరవ్ నిలిచారు.ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వీడియోను న్యూజిలాండ్లోని భారత హై కమీషన్ ట్విట్టర్లో పెట్టడంతో వైరల్ అయ్యింది.
అయితే హిందీలో ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదని ఓ నెటిజెన్ గౌరవ్ ను సూటిగా ప్రశ్నించారు.దీనికి బదులిచ్చిన ఆయన.నిజానికి తాను హిందీలోనే ప్రమాణ స్వీకారం చేద్దామనుకున్నట్టు వెల్లడించారు .కానీ హిందీ కన్నా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా భారతీయ భాషలన్నింటినీ గౌరవించినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
హిమాచల్ప్రదేశ్కు చెందిన గౌరవ్ శర్మ 20 ఏళ్ల క్రితం న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డారు.ఆక్లాండ్లో ఎంబీబీఎస్, వాషింగ్టన్లో ఎంబీఏ పూర్తి చేశారు.గత నెలలో జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ తరఫున ఎంపీగా పోటీచేసి ప్రత్యర్థి టిమ్ మసిండోపై 4,425 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు.