అమెరికాలో భారత సంతతికి చెందిన వైద్యుడు తన ప్రతిభను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు.కరోనా సోకిన మరో రోగికి నెల రోజుల వ్యవధిలో రెండోసారి ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ చేశారు.
చికాగోలో స్థిరపడిన డాక్టర్ అంకిత్ భరత్ నేతృత్వంలో వైద్య బృందం ఓ ఆసుపత్రిలో దాదాపు మూడున్నర నెలల నుంచి వెంటిలేటర్పై వున్న 60 ఏళ్ల పేషెంట్కు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసింది.
కోవిడ్ 19 కారణంగా ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
పేషెంట్ ప్రాణాలను కాపాడేందుకు గాను అంకిత్ తన బృందంతో కలిసి సుమారు 10 గంటల పాటు శ్రమించి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.అంకిత్ వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నుంచి 2003లో ఎంబీబీఎస్ పట్టా పొందారు.
అనంతరం చికాగోలోని నార్త్వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్లో చేరారు.ప్రస్తుతం చీఫ్ ఆఫ్ థొరాసిక్ సర్జరీగా వ్యవహరిస్తున్నారు.
కాగా గత నెల 12న కోవిడ్తో బాధపడుతున్న ఓ యువతికి అంకిత్ ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్ను విజయవంతంగా చేశారు.ఈ తరహా సర్జరీ అమెరికాలో నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.కరోనాతో బాధపడుతున్న పేషెంట్లకు చికిత్స ఇచ్చే హాస్పిటల్స్.లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్పై దృష్టి పెట్టాలని అంకిత్ అప్పట్లోనే సూచించారు.కాగా అమెరికాలో కోవిడ్ 19 విలయతాండవం చేస్తోంది.ఇప్పటి వరకు అక్కడ 34,14,042 మందికి కరోనా సోకగా.1,37,784 మంది ప్రాణాలు కోల్పోయారు.