సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రా నూయి వీరంతా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వలస వెళ్లి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన భారతీయులే.తమ కృషి, పట్టుదల, ప్రతిభతో వీరు అద్భుత విజయాలను సాధిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
తద్వారా నీడనిచ్చిన దేశానికి పేరు తీసుకొస్తూనే మరోవైపు భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.తాజాగా అమెరికాలో స్థిరపడిన భారత సంతతి పారిశ్రామిక వేత్తకు అరుదైన పురస్కారం దక్కింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను డా.దినేష్ సీ పటేల్కు ఉతా గవర్నర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది.బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో పటేల్ సేవలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.కాగా, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రానికి విశిష్ట సేవలను అందించిన వారి కృషికి గుర్తింపుగా 1987 నుంచి ఉతా ప్రభుత్వం ‘గవర్నర్ మెడల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ పురస్కారం అందిస్తోంది.
దీనిలో భాగంగానే పటేల్ను బుధవారం సత్కరించారు.
భారత్ నుంచి 40 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన దినేశ్ పటేల్ ఉతాలో స్థిరపడ్డారు.
బయోటెక్నాలజీ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో ఆయన ఎన్నో ఆవిష్కరణలు చేశారు.పటేల్ కృషి ఫలితంగా ఈ రంగంలో ఆర్థిక విజయాన్ని సాధించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది జీవితాలను మెరుగుపరిచింది.1985లో థెరాటెక్ అనే బయోటెక్ సంస్థను స్థాపించిన దినేశ్ పటేల్ అధ్యక్షుడిగా, సీఈఓగా తన నాయకత్వ ప్రతిభతో విజయవంతంగా నడిపించారు.1999లో ఈ సంస్థను వాట్సన్ ఫార్మాస్యూటికల్స్ ఏకంగా 350 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం విశేషం.
థెరాటెక్ కంటే ముందే దినేశ్.సాలస్ థెరప్యూటిక్స్ అనే సంస్థను స్థాపించారు.ఇది యాంటీ సెన్స్ ఫార్మాస్యూటికల్స్ను అభివృద్ధి చేసే బయోటెక్నాలజీ సంస్థ.ఆ తర్వాత కూడా పటేల్ ఉతా రాష్ట్రంలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.
వీటిలో ఫ్యామిలీ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కూడా ఉన్నాయి.ఈ విధంగా రాష్ట్రాభివృద్ధికి దోహాదం చేసినందుకు గాను దినేష్ పటేల్ను ప్రభుత్వం ఉతా గవర్నర్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
.