యూఏఈలో విషాదం చోటు చేసుకుంది.భారతీయ దంపతులు తమ నివాసంలోనే శవాలుగా తేలారు.
ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం.కేరళకు చెందిన జనార్థన్ పట్టీరీ, మినిజా దంపతులు 18 ఏళ్ల క్రితం అబుధాబి వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారు.
జనార్థన్ ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తుండగా.మినిజా చార్టెడ్ అకౌంటెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
వీరికి ఓ కుమారుడు ఉన్నాడు.అబుధాబిలోనే ఉన్నత చదువులు చదువుకున్న అతను ప్రస్తుతం బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో కరోనా చిచ్చు పెట్టింది.
వైరస్ కారణంగా పర్యాటక రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో జనార్థన్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు.
ఇది వీరికి తీవ్ర మనోవేదనను కలిగించింది.ఎప్పటిలాగే బెంగళూరులో ఉన్న జనార్థన్ కుమారుడు తల్లిదండ్రుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఫోన్ చేశాడు.
నాలుగు రోజులుగా ఫోన్ చేసినప్పటికీ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.అనుమానంతో ఈ గురువారం తన పక్కింటి వారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఒకసారి తన తల్లిదండ్రులకు ఫోన్ ఇవ్వాలని చెప్పగా.వారు జనార్థన్ ఇంటికి వెళ్లి తలుపుకొట్టారు.కానీ ఎంతసేపటికి అటు నుంచి స్పందన లేకపోవడంతో బయటికి వెళ్లారేమోనన్న అనుమానంతో సెక్యూరిటీ గార్డును ఆరా తీశారు.అతను గత నాలుగు రోజులుగా జనార్థన్ దంపతులు కనిపించడం లేదని చెప్పాడు.
దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.జనార్థన్ ఫ్లాట్కి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా దంపతులు లోపల శవమై కనిపించారు.
ఆర్ధిక ఇబ్బందుల కారణంగా దంపతులు ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.సామాజిక కార్యకర్త ఒకరు అక్కడి అధికారిక లాంఛనాలు పూర్తి చేసి జనార్థన్ దంపతుల మృతదేహాలను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు.