అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన మహిళా జర్నలిస్టు ఒకరు దుర్మరణం పాలయ్యారు.26 ఏళ్ల నినా కపూర్ న్యూయార్క్లోని ప్రముఖ వార్తా సంస్థ సీబీఎస్ టీవీలో రిపోర్టర్గా పనిచేస్తున్నారు.ఈ క్రమంలో ఆమె శనివారం అద్దె బైక్పై న్యూయార్క్ బ్రూక్లిన్ బరోలోని ఇండియా స్ట్రీట్ కూడలివైపు వెళుతున్నారు.ఈ సమయంలో ఆమె బైక్ గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో నినాతో పాటు మోపెడ్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై ఎగిరి పడ్డారు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నినాను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.నినాతో పాటు ప్రమాదంలో గాయపడిన బైక్ డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అతని వివరాలు ఇంకా తెలియరావాల్సి వుందని పోలీసులు తెలిపారు.
మరోవైపు నినా కపూర్ మరణంపై సీబీఎస్ ఛానెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఆమె 2019లో తమ సంస్థలో చేరారని, చెరగని చిరునవ్వుతో నినా అందరితో కలివిడిగా ఉండేవారని గుర్తుచేసుకుంది.భారతదేశ వారసత్వం గురించి ఆమె గర్వంగా చెప్పుకునేదని సహోద్యోగి, యాంకర్ మేరి కాల్వీ అన్నారు.
విధి నిర్వహణలో భాగంగా నినా న్యూయార్క్లోని సీబీఎస్ ఆన్ ఎయిర్ స్టేషన్ కోసం ఫీల్డ్లో కవర్ చేసేవారు.దానితో పాటు సీబీఎస్ న్యూస్ 24 X 7 న్యూయార్క్ ఛానెల్ కోసం త్రి స్టేట్ న్యూస్ రౌండ్ను ప్రతిరోజూ అందించేవారని ఆ సంస్థ వెల్లడించింది.
సీబీఎస్లో చేరకముందు నినా.కనెక్టికట్లోని ఛానెల్ 12 న్యూస్లో పనిచేశారు.నినా కపూర్ మరణవార్తతో ఆ ఛానెల్లో ఆమెతో కలిసి పనిచేసిన సిబ్బంది తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు.దీనిని తాము నమ్మలేకపోతున్నామని.ఆమె చిరునవ్వు ఇంకా తమకు గుర్తుందని వారు కన్నీటి పర్యంతమయ్యారు.