కరోనా సెకండ్ వేవ్తో భారతదేశం చివురుటాకులా వణికిపోతోంది.చికిత్స కోసం కరోనా రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.
అయితే దేశంలో ఏ మూల చూసినా బెడ్లు దొరక్క జనం అల్లాడిపోతున్నారు.కోటాను కోట్ల ఆస్తులు ఉండి కూడా ఏం చేయలేక చివరికి చెట్ల కింద ఓ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని కరోనాతో పోరాడుతున్నారు.
మరి సామాన్యుల పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.తమ వారు చనిపోయేలా వున్నారని.
ఆసుపత్రిలో చేర్చుకోవాలంటూ రోగుల బంధువులు చేస్తున్న అభ్యర్ధనలు కంటతడి పెట్టిస్తున్నాయి.ఒకవేళ దయతలచి ఆసుపత్రుల్లో చేర్చుకుంటున్నా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది.
ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి పెంచాల్సిందిగా తయారీదారులను కోరింది.అలాగే దేశంలోని ఉక్కు కర్మాగారాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది.
దీనికి అదనంగా విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పిస్తోంది.కానీ రోజురోజుకు బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అవి ఏ మూలకు సరిపోవడం లేదు.కిష్ట పరిస్ధితుల్లో వున్న మాతృదేశాన్ని ఆదుకునేందుకు ఆయా దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారు.ఇప్పటికే వివిధ భారతీయ సంఘాలు పెద్ద ఎత్తున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, సిలిండర్లు, మందులు, వైద్య పరికరాలను పంపుతున్నాయి.
అంతేకాకుండా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి పీఎం రిలీఫ్ ఫండ్కు అందజేస్తున్నారు.ఈ క్రమంలో మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు ఇండో అమెరికన్ పారిశ్రామిక వేత్త వినోద్ ఖోస్లా.
ఇప్పటికే ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు పడుతున్న మనదేశంలోని ఆసుపత్రులకు బాసటగా నిలిచారాయన.ఆక్సిజన్ను దిగుమతి చేసుకోవడానికి వనరులు అసవరమయ్యే భారతీయ ఆసుపత్రులకు తాను నిధులు సమకూరుస్తానని వినోద్ ఖోస్లా ప్రకటించారు.
సాయం కావాల్సిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా సంప్రదించాలని గత వారం సూచించారు.
తాజాగా వారం వ్యవధిలోనే మరో సాయాన్ని ప్రకటించారు వినోద్ ఖోస్లా.భారత్లోని ఆసుపత్రులకు ఆక్సిజన్ అందించేందుకు గాను మరో 10 మిలియన్ డాలర్లను విరాళం అందిస్తానని వినోద్ వెల్లడించారు.దీనిపై ఆయన స్పందిస్తూ … తాము ఎంత సాయం చేసినా ప్రస్తుత పరిస్ధితుల్లో భారత్కు సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను చూసి మిగిలిన వారు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తారని వినోద్ ఖోస్లా ఆకాంక్షించారు.
ఢిల్లీకి చెందిన వినోద్ ఖోస్లా.
సిలికాన్ వ్యాలీలో వెంచర్ క్యాపిటల్ సంస్థ ఖోస్లా వెంచర్ను స్థాపించారు.వ్యాపారంలో దూసుకుపోతున్న ఆయన ఫోర్బ్స్ ఇండో అమెరికన్ బిలియనీర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు.ఆయన ఆస్తుల విలువ 2.9 బిలియన్ డార్లు.బయోమెడిసిన్, రోబోటిక్స్ వంటి సాంకేతికతల అభివృద్ధిలో ఖోస్లా వెంచర్స్ పెట్టుబడులు పెడుతోంది.