వేల ఏళ్లుగా మనిషి ఊహకు అందనది ఖగోళం.అంతరిక్షంలోని గుట్టును విప్పేందుకు అనాది కాలంగా మానవుడు ప్రయత్నిస్తూనే వున్నాడు.
భూమి మీద విలసిల్లిన ప్రఖ్యాత నాగరికతలకు చెందిన వారు ఖగోళాన్ని అధ్యయనం చేశారు.మనదేశం విషయానికి వస్తే ఆర్యభట్ట, వరాహిమిహిరుడు వంటి శాస్త్రవేత్తలు ఎన్నో గ్రంథాలను రచించారు.
ఆధునిక కాలంలో అందుబాటులోకి వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో మనిషి అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్నాడు.చంద్రుడి మీద కాలు పెట్టాడు.
అంగారకుడి మీద నివాస యోగ్యమైన ప్రాంతాల కోసం అన్వేషణ జరుపుతున్నాడు.ఇప్పుడు ఏకంగా అంతరిక్ష రంగాన్ని విహారయాత్రలకు, పర్యాటకానికి వేదిక చేయాలని భావిస్తున్నాడు.
ఇకపోతే.ఎంతోమందికి వ్యోమగాములుగా రాణించాలని కల.ఇటీవలి కాలంలో విద్యారంగంలో అనేక మార్పులు రావడంతో పాటు అంతరిక్ష పరిశోధక సంస్థలు సైతం రకరకాల కార్యక్రమాల ద్వారా వ్యోమగాములను రిక్రూట్ చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన మహిళ రోదసిలోకి అడుగుపెట్టాలనే తన లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే… అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి కేరళకు చెందిన అతిరా ప్రీతి రాణి ఎంపికయ్యారు.ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేస్తే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న మూడో భారతీయ మహిళగా అతిరా చరిత్ర రికార్డుల్లోకెక్కనుంది.
కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన వీ వేణు, ప్రీతిల కుమార్తె అతిరా.అంతరిక్షం, ఖగోళ శాస్త్రంపై ఆసక్తితో త్రివేండ్రంలోని ఆస్ట్రానామికల్ సొసైటీ శిక్షణా తరగతులకు హాజరయ్యేవారు.అనంతరం కెనడాలోని అల్గోనిక్విన్ కాలేజీలో స్కాలర్షిప్తో రోబోటిక్ కోర్సులో అతిరా సీటు సాధించారు.పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తూనే ఆమె మంచి మార్కులతో కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు.
ఇదే సమయంలో ప్రేమలో పడిన అతిరా తాను ఇష్టపడిన గోకుల్ను పెళ్లాడారు.తర్వాత ఎక్సో జియో ఏరోస్పేస్ కంపెనీ పేరుతో కెనడాలో స్టార్టప్ ప్రారంభించారు.కానీ రోదసిలో అడుగుపెట్టాలనే తన కలను నెరవేర్చేకునే లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు.నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ కెనడాలు నిర్వహించే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ , ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి దరఖాస్తు చేసి ఇందులో ఉత్తీర్ణత సాధించింది.అంతేకాదు… నాసా ఆస్ట్రోనాట్ ప్రోగ్రామ్కి ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఎంపికైన 12 మందిలో ఒకరిగా అతిరా ఘనత సాధించారు.