భారతీయులు పెద్ద సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో వున్న కెనడాలో ఇప్పుడు ఇండో కెనడియన్ల ప్రాబల్యం పెరుగుతోంది.సరళమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి.
కెనడాకు దగ్గరవుతున్నారు.ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ఇకపోతే కెనడాలోనూ భారతీయులు రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు.ఇప్పటికే చట్టసభ సభ్యులుగా, రాజకీయ పార్టీ నేతలుగానూ ఇండో కెనడియన్లు రాణిస్తున్నారు. తాజాగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిన్ ట్రూడో కేబినెట్ను పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్ను నియమించారు.
ఇప్పటివరకు కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ బాధ్యతలు నిర్వర్తించారు.అయితే సైన్యంలో లైంగిక వేధింపుల అంశానికి సంబంధించిన దర్యాప్తులో ఆయన తీరుపై ప్రతిపక్షాలు, మీడియా దుమ్మెత్తిపోశాయి.
దీంతో స్పందించిన ట్రూడో సజ్జన్ను రక్షణ శాఖ నుంచి తప్పించి ఆ బాధ్యతలు అనితా ఆనంద్కు అప్పగించారు.అనంతరం సజ్జన్ను అంతర్జాతీయ అభివృద్ధి శాఖ మంత్రిగా నియమించారు.54 ఏళ్ల అనితా ఆనంద్ ఓక్ విల్లే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అనితా ఆనంద్ తల్లిదండ్రులు భారతీయులే.తల్లి పంజాబ్కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్, తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.వీరికి ఐర్లాండ్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇంగ్లాండ్లో పెళ్లి చేసుకున్నారు.
భారత్, నైజీరియాలలో నివసించిన వీరు 1965 నుంచి కెనడాలో స్థిరపడ్డారు.ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఉన్నారు.
అనిత తాతగారు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.
2019 అక్టోబర్లో అనిత కెనడా పార్లమెంట్కు ఎన్నికయ్యారు.హౌస్ ఆఫ్ కామన్స్కు ఎన్నికై, ప్రధాని జస్టిన్ టూడ్రో కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్న మొదటి హిందూ మహిళగా రికార్డుల్లోకెక్కారు.ప్రస్తుతం నలుగురు పిల్లలకు తల్లిగా ఉన్న అనితా ఆనంద్ ఓక్విల్లే ప్రాంతంలోని ప్రజలకు అత్యంత సన్నిహితంగా మెలుగుతారు.
రాజకీయాల్లోకి రాకముందు టొరంటో విశ్వవిద్యాలయంలో లా ప్రొఫెసర్గా ఆమె సేవలందించారు.