కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడేందుకు అన్ని దేశాలు అనుసరించిన తారక మంత్రం లాక్డౌన్.ప్రజలను గడప దాటకుండా చేసి వైరస్ చైన్ను కట్ చేసేందుకు విధించిన లాక్డౌన్ సత్ఫలితాలనే ఇచ్చింది.
లేదంటే ప్రపంచం మరోలా వుండేది.అయితే కొన్ని దేశాల్లో లాక్డౌన్ నిబంధనలు విమర్శలకు తావిచ్చాయి.
ఈ క్రమంలో యూకే ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్పై సుమారు 30 మంది విద్యావేత్తలు విమర్శలు చేశారు.ఈ బృందానికి భారత సంతతికి చెందిన ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ సునేత్ర గుప్తా నేతృత్వం వహించనున్నారు.
సునేత్ర గుప్తా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో థియారిటీకల్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్గా వ్యవహరిస్తున్నారు.కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ స్పందనకు సంబంధించి ఈ వారం ప్రథమంలో ప్రధాని బోరిస్ జాన్సన్, ఆర్ధిక మంత్రి రిషి సునక్, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్లకు చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్లకు సునేత్ర బృందం లేఖ రాసింది.
ఈ బృందం ప్రాణాంతక వైరస్లకు ఎక్కువగా గురయ్యే సమూహాలను రక్షించేందుకు మరిన్ని చర్యలను సిఫారసు చేసింది.
కోవిడ్ మరణాలు సంభవిస్తున్న వారిలో 89 శాతం 65 ఏళ్ల పైబడిన వారే ఉన్నందున వైద్య సహాయం ఎక్కువగా ఈ గ్రూప్పైనే కేంద్రీకరించాలని సునేత్ర బృందం స్పష్టం చేసింది. మరోవైపు క్యాన్సర్ చికిత్సపై కరోనా ప్రభావం చూపుతోందని ఈ బృందం అభిప్రాయపడింది. చికిత్స, స్క్రీనింగ్, పరీక్షలలో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు.
కోవిడ్ 19 సోకిన వారిలో నెలలు లేదా సంవత్సరాలుగా రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందో లేదో తమకు తెలియదని వారు లేఖలో ప్రస్తావించారు.బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ఈ లేఖను ప్రచురించారు.
ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతూనే వైరస్ను నియంత్రించడంలో సహాయపడే చర్యలను ఈ బృందం లేఖలో ప్రస్తావించింది.ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించడాన్ని తప్పనిసరి చేయడం, పాఠశాలలు, కార్యాలయాల్లో వెంటిలేషన్ సౌకర్యాలను మెరుగుపరచడం, ఇండోర్ సమావేశాల్లో సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి సిఫారసులు చేసింది.
కాగా కరోనా వైరస్ మహమ్మారి విలయానికి ఇంగ్లాండ్ మరోసారి ఉక్కిరిబిక్కిరవుతోంది.దీనికోసం ప్రత్యేకంగా కొత్త నిబంధనలు రూపొందించారు.ఇప్పటికే ఫ్రాన్స్, స్పెయిన్తోపాటు యూరప్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని, ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని అభిప్రాయపడ్డారు.వైరస్పై పోరులో భాగంగా, ప్రతిఒక్కరు నిబంధనలు పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం ఒక్కటే మార్గమని ప్రధాని స్పష్టంచేశారు.
దీంతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయనుంది.తాజాగా రూపొందించిన కొవిడ్ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే వెయ్యి నుంచి పదివేల పౌండ్ల (దాదాపు రూ.10లక్షలు) వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.పాజిటివ్ వచ్చిన వారితో పాటు వైరస్ లక్షణాలున్నవారు కచ్చితంగా పది నుంచి 14రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలి.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై వెయ్యి నుంచి పదివేల పౌండ్ల వరకు జరిమానా విధించనున్నారు.సెప్టెంబర్ 28 నుంచి అక్కడ ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
.