మనచుట్టూ చోటు చేసుకునే కొన్ని మరణాలు, ఇతర సంఘటనల వెనుక వీడని చిక్కుముడులు ఎన్నో.వాటి వెనుక రహస్యాలను ఛేదించేందుకు ఏళ్ల పాటు ప్రయత్నించి.
ఇక చేసేదిలేక క్లోజ్ అయిన ఫైళ్లు ఎన్నో.తాజాగా ఆరేళ్ల క్రితం అనుమానాస్పద స్థితిలో మరణించిన భారత సంతతి నర్స్ హత్య కేసును ఛేదించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం పట్టుదలగా వుంది.
దీనిలో భాగంగా నిందితుల గురించి కానీ, ఈ కేసు గురించి కానీ సమాచారం అందించిన వారికి 5 లక్షల డాలర్ల బహుమానం అందిస్తామని ప్రకటించింది.
ఇండో- ఫిజియన్ సంతతికి చెందిన మోనికా చెట్టి (39) 2014 జనవరిలో దారుణ హత్యకు గురయ్యారు.
ఆమె ముఖం, శరీరంపై యాసిడ్తో దాడి చేసిన దుండగులు సిడ్నీకి 40 కిలోమీటర్ల దూరంలో గల వెస్ట్ హోస్టన్ వద్ద అడవిలో పడేశారు.ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై, కొనఊపిరితో వున్న మోనికను ఆస్పత్రిలో చేర్పించగా నెలరోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆమె తుదిశ్వాస విడిచారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన న్యూసౌత్వేల్స్ పోలీసులు అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.అయితే ఇంతవరకు నిందితుల జాడ మాత్రం కనుక్కోలేకపోయారు.ఆరేళ్లు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ కేసును ప్రతిష్టాత్మకంగా భావించిన స్థానిక ప్రభుత్వం మోనిక హంతకుల ఆచూకీ చెప్పిన వారికి 5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు బహుమానంగా ప్రకటించింది.
మరోవైపు మోనిక కుమారుడు డేనియల్ చెట్టి ఆమెను గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.
తన తల్లి మృతికి గల కారణాల కోసం ఆరేళ్లుగా అన్వేషిస్తున్నామని, అయినా ఇంతవరకు చిన్న ఆధారం కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.కాగా, నర్స్గా పనిచేస్తున్న మోనికా ఓ వీసా కుంభకోణంలో ఇరుక్కుందని.
తన ప్రాణాలకు ప్రమాదముందంటూ తరచూ భయపడేదని ఆమె స్నేహితులు వెల్లడించారు.