ఈ భూమి మీద మూడు వంతుల నీరు, ఒక వంతు మాత్రమే మనం ఉంటున్న నేల ఉంది.అలాంటి సముద్రంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి.
నాగరిక ప్రపంచంలో తరతరాలుగా వస్తున్నా ఎన్నో నాగరికతలు ఈ సముద్రగర్భంలో కలిసిపోయాయి.ఎన్నో మహా నగరాలు, పట్టణాలు కూడా సముద్రంలో చేరిపోయాయి.
అలాగే సముద్ర గర్బంలో ఎన్నో పర్వతాలు, లోయలు కూడా ఉన్నాయి.సహజసిద్ధంగా ఏర్పడిన లోయలు, పర్వతాల సమూహాలని మానవ మేధస్సు చాలా చోట్ల ఆవిష్కరించింది.
అయితే ఇండియాలో విశాఖ సముద్ర తీరంలో అలాంటి సహజమైన లోయలు ఉన్నాయనే విషయాన్ని తాజాగా కనుగొన్నారు.ఈ సహజ లోయలు సముద్ర రక్షణలో భారత్ కి ఎంతో కీలక అవుతాయని భావిస్తున్నారు.
అలాగే సహజ నిక్షేపాలు అయిన చమురు, సహజ వాయువు నిక్షేపాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.భూమ్మీద మాదిరిగానే సముద్ర గర్భంలో ఏర్పడ్డ లోయలు, గుహలని సబ్మెరైన్ కానియాన్స్ గా పిలుస్తారు.
ఇలాంటివి ప్రపంచం మొత్తమ్మీద 600 వరకు ఉన్నట్టు ఇప్పటివరకు గుర్తించారు.ఎన్ఐవో శాస్త్రవేత్తలు మనదేశంలోని సముద్ర జలాల్లోనూ కొంతకాలం క్రితం అత్యాధునిక పరిశోధన నౌక సింధు సాధనతో ఇలాంటి అన్వేషణలు చేపట్టారు.
వీరి అన్వేషణలో బంగాళాఖాతంలో విశాఖపట్నం– భీమిలీ మధ్య తీరానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో సాగర గర్భంలో ఉన్న లోయలను కనుగొన్నారు.ఇవి సముద్ర నీటికి 300 మీటర్ల దిగువన 18 కి.మీ.మేర విస్తరించి ఉన్నాయని గుర్తించారు.వీటిని నావికాదళం తన రక్షణ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.