అమెరికాలో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు.శనివారం ఉదయం లాస్ ఏంజిల్స్లోని ఓ కిరాణా స్టోర్లోకి ముసుగు వేసుకుని ప్రవేశించిన ఓ దుండగుడు భారతీయ యువకుడిని కాల్చి చంపాడు.
మనీందర్ సింగ్ సాహి గత నెలలో 31వ జన్మదినాన్ని జరుపుకున్నాడు.అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భారత్లోని కర్నాల్కు చెందిన అతను ఆరు నెలల క్రితమే యూఎస్ వచ్చి ఆశ్రయం పొందాడు.మనీందర్ కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజిల్స్ కౌంటి విట్టీర్ సిటీలోని 7 ఎలెవన్ కిరాణా స్టోర్లో పనిచేస్తున్నాడు.
సాహి సంపాదనపైనే అతని భార్యాపిల్లలు ఆధారపడి జీవిస్తున్నారు.ప్రతి నెల కొంతమొత్తాన్ని అతను భారత్కు పంపేవాడని అమెరికాలోని అతని బంధువులు తెలిపారు.
శనివారం తెల్లవారుజామున 5.43 గంటలకు ఈ ఘటన జరిగిందని విట్టీర్ పోలీసు శాఖ ప్రకటించింది.ప్రాథమిక దర్యాప్తు ప్రకారం దోపిడీ చేయాలనే ఉద్దేశ్యంతోనే దుండగుడు సెమీ ఆటోమేటిక్ హ్యాండ్ గన్తో స్టోర్లోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది.అయితే అగంతకుడు భారతీయుడిని ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చిందనే దానిపై కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.
కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.ఘటన జరిగిన సమయంలో మనీందర్తో పాటు మరో ఇద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది.అయితే వారిద్దరికి ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు.దుండగుడిని నల్లజాతి వ్యక్తిగా అనుమానిస్తున్నారు.సీసీటీవీ ఫుటేజ్ ద్వారా సేకరించిన అతని ఫోటోను పోలీసులు విడుదల చేశారు.మనీందర్ సింగ్ సాహి మృతదేహాన్ని భారతదేశానికి తరలించేందుకు అవసరమైన డబ్బు కోసం అమెరికాలోని అతని సోదరుడు GoFundMe పేజీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాడు.