కరోనా కారణంగా ప్రపంచంలో అత్యంత తీవ్రంగా నష్టపోయిన దేశం ఏదైనా వుందంటే అది అమెరికాయే.గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు అక్కడ హృదయ విదారక వాతావరణం చోటు చేసుకుంటూనే వుంది.
కోవిడ్ బాధితులు పెరిగిపోవడం, ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేక అంబులెన్స్లు, కార్లలోనే చికిత్స, చనిపోయిన మృతదేహాలను బయటకి తీసుకొస్తున్న సిబ్బంది ఇవే దృశ్యాలు కనిపిస్తూనే వుండేవి.దీంతో స్థానిక అమెరికన్లతో పాటు విదేశీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపేవారు.
ఈ నేపథ్యంలో కోవిడ్ భయంతో ప్రయాణం చేయడానికి భయపడిన ఓ భారతీయ అమెరికన్ చికాగో విమానాశ్రయంలోనే మూడు నెలల పాటు ఉండిపోయిన వ్యవహారం గుర్తుందా.నిషేధిత ప్రాంతంలోకి వచ్చినందుకు గాను అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే 2004 నాటి టామ్ హాంక్స్ సినిమా ‘‘ది టెర్మినల్’’ తో పోల్చి చూపుతూ న్యాయమూర్తి అతనిని నిర్దోషిగా ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే… కాలిఫోర్నియాకు చెందిన ఆదిత్య సింగ్.
గత ఏడాది అక్టోబర్ 19వ తేదీ చికాగోలోని ఓ-హేర్ విమానాశ్రయం చేరుకున్నాడు.అయితే కోవిడ్ కారణంగా లాస్ ఏంజిల్స్కు వెళ్లేందుకు అతను భయపడ్డాడు.దీంతో ఆదిత్యకు ఓ ఆలోచన వచ్చింది.ఆ ఎయిర్పోర్ట్లోనే నకిలీ ఐడీతో ఓ ఉద్యోగిలా ఉండిపోయాడు.ఈ క్రమంలో ఆదిత్య సింగ్పై అనుమానం రావడంతో ఇద్దరు యునైటెడ్ ఎయిర్లైన్స్ సిబ్బంది అతడిని ఆరా తీశారు.గతేడాది అక్టోబరులో మిస్సయిన ఆపరేషన్స్ మేనేజర్ బ్యాడ్జ్ను ఆదిత్య చూపించడంతో వారు ఖంగుతిన్నారు.
వెంటనే 911కి సమాచారం అందించడంతో ఆదిత్యను జనవరి 16న పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.
మూడు నెలలుగా ఓ అజ్ఞాత వ్యక్తి ఎయిర్పోర్ట్లో కాలం గడుపుతుంటే మీరేం చేస్తున్నారని ఈ ఏడాది జనవరి 19న జరిగిన విచారణ సందర్భంగా చికాగో కౌంటీ జడ్జి సుసానా ఆర్టిజ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఇటువంటి సమయంలో కోర్టు గుర్తించిన వాస్తవాలు, పరిస్థితులు చాలా దిగ్భ్రాంతికి గురిచేశాయని’ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.ఇకపోతే లాస్ ఏంజెల్స్ శివారులో స్నేహితులతో కలిసి నివసిస్తున్న ఆదిత్యకు గతంలో ఎటువంటి క్రిమినల్ రికార్డు లేదని అసిస్టెంబ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
హాస్పిటాలిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసినట్టు ఆయన తెలియజేశారు.దీనిని పరిగణనలోనికి తీసుకున్న న్యాయమూర్తి… బెయిల్ కోసం 1,000 డాలర్లు చెల్లించడంలో విఫలమైతే ఆదిత్యను విమానాశ్రయంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని అధికారులను ఆదేశించారు.
తాజా విచారణలో భాగంగా ఆదిత్య సింగ్ విమానాశ్రయంలోని నిషేధిత ప్రాంతంలో ఎలాంటి నేరపూరిత అతిక్రమణకు పాల్పడలేదని కుక్ కౌంటీ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.అయితే ఎలక్ట్రానిక్ మానిటరింగ్ను ఉల్లంఘించినందుకు సంబంధించిన ప్రత్యేక ఎస్కేప్ ఛార్జ్ను ఇప్పటికీ ఎదుర్కొంటున్నాడు.ఈ కేసు శుక్రవారం కోర్టు విచారణకు రానుంది.మరోవైపు ట్రాన్స్పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ చేపట్టిన దర్యాప్తులో ఆదిత్య సింగ్ విమానాశ్రయ నిబంధనలను ఉల్లంఘించలేదని తేలింది.