13 ఏళ్ల పాటు దేశం కానీ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్న ఓ ప్రవాస భారతీయుడు ఎట్టకేలకు మాతృదేశానికి చేరుకున్నాడు.వివరాల్లోకి వెళితే.
తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన పోతుగొండ మేడి అనే 47 ఏళ్ల వ్యక్తి 2007లో పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లాడు.కరోనా వైరస్ నేపథ్యంలో అతను ఉద్యోగం కోల్పోవడంతో మరో ఉద్యోగంలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.చివరికి ఎలాంటి ఫలితం లేకపోవడంతో తెలంగాణకు తిరిగి వెళ్లేందుకు గాను పోతుగొండ దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ను సంప్రదించినట్లు కాన్సులర్ జనరల్ జితేంద్ర నేగి గల్ఫ్ న్యూస్కు వెల్లడించారు.
2007లో విజిట్ వీసాపై ఓ ఏజెంట్ తనను గల్ఫ్కు తీసుకొచ్చాడని పోతుగొండ తమతో చెప్పినట్లు జితేంద్ర వెల్లడించారు.అలాగే ఆ ఏజెంట్ మేడి పాస్పోర్ట్ని సైతం అతనికి ఇవ్వలేదు.పోతుగొండ తన పౌరసత్వాన్ని నిరూపించుకుంటేనే అతనికి సాయం చేయడం వీలవుతుంది.దీంతో కాన్సులేట్ జనరల్ హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త శ్రీనివాస్ సాయం కోరారు.వెంటనే రంగంలోకి దిగిన ఆయన పోతుగండ ఫోటోను గతేడాది అక్టోబర్ 9న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అతనిని గుర్తించిన శ్రీహరి రెడ్డి అనే వ్యక్తి పోతుగొండ తమ గ్రామానికి చెందిన వాడని శ్రీనివాస్కు సమాచారం అందించాడు.ఈ ఆధారాల సాయంతో శ్రీనివాస్ నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ను సంప్రదించారు.
పోతుగొండ నిజామాబాద్ జిల్లా బోధన్లోని పెగడపల్లె గ్రామానికి చెదిన వ్యక్తని నిర్థారించుకున్న తర్వాత జూలై 24న అరవింద్ దుబాయ్లోని భారత కాన్సులేట్ కార్యాలయానికి లేఖ రాశారు.పోతుగొండ పాత రేషన్ కార్డు, ఎన్నికల ఐడీ కాపీలను పొందిన అనంతరం కాన్సులేట్ కార్యాలయం అతనికి తాత్కాలిక పాస్పోర్ట్, ఉచిత విమాన టికెట్ సమకూర్చింది.
అయితే ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్నందుకు గాను పోతుగొండకు యూఏఈ ప్రభుత్వం ఐదు లక్షల దిర్హామ్స్ ( భారత కరెన్సీలో రూ.కోటి ఇరవై ఒక్క వేలు) జరిమానా విధించింది.భారత కాన్సులేట్ అధికారులు దుబాయ్ అధికారులతో మాట్లాడి పోతుగొండ చెల్లించాల్సిన వీసా జరిమానాను వీసా గడువు మినహాయింపు పథకం కింద మాఫీ చేయించారు.ఈ పథకం ప్రకారం 2020 మార్చి 1 లోపు వీసా గడువు ముగిసిన ప్రవాసులు ఎలాంటి వీసా బకాయిలు చెల్లించకుండా నవంబర్ 17 లోపు యూఏఈని వదిలి వెళ్లొచ్చు.
దీని ప్రకారం దుబాయ్లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ కార్యాలయం పోతుగొండ జరిమానాను మాఫీ చేయించింది.
అనంతరం మేడి ఎంతో సంతోషంతో 13 ఏళ్ల తర్వాత సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు.
తనకు ఎంతో సాయం చేసిన భారత కాన్సులేట్ కార్యాలయం, సామాజిక కార్యకర్త శ్రీనివాస్, నిజామాబాద్ ఎంపీ అరవింద్లకు బాధితుడు ధన్యవాదాలు తెలియజేశారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్న పోతుగొండ 14 రోజుల తర్వాత కుటుంబాన్ని కలవనున్నాడు.