మహిళలపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన భారతీయుడికి యూకే కోర్టు జీవిత ఖైదు విధించింది.తీర్పు సందర్భంగా అతని చేతుల్లో బలైపోయిన బాధితులు, బాధిత కుటుంబసభ్యులు కోర్టుకు భారీ సంఖ్యలో వచ్చారు.
వ్యాస్ క్రూరత్వం, నీచమైన వ్యక్తిత్వానికి ఇది సరైన శిక్ష అని స్కాట్లాండ్ యార్డ్ దర్యాప్తు అధికారి డిటెక్టివ్ షలీనా షేక్ అన్నారు.అమన్ వ్యాస్ ముగ్గురు మహిళలపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఒకరిని దారుణంగా హత్య చేశాడు.తన నేరాలు బయటపడటంతో వ్యాస్ భారతదేశానికి పారిపోయాడు.
10 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు దర్యాప్తు సందర్భంగా బాధితులు, వారి కుటుంబాలు మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించాయి.కాగా అమన్ వ్యాస్ ఒక మహిళపై అత్యాచారం చేసినందుకు (16 సంవత్సరాల ఐదు నెలలు), రెండవ మహిళపై అత్యాచారం చేసినందుకు (పద్దెనిమిదిన్నర సంవత్సరాలు), మూడవ మహిళలపై అత్యాచారం చేసినందుకు (పద్దెనిమిదిన్నర సంవత్సరాలు), మిచెల్ సమరవీరపై అత్యాచారం, హత్య (పద్దెనిమిదిన్నర సంవత్సరాలు) అలాగే ఉద్దేశ్యపూర్వకంగా నేరాలకు పాల్పడినందుకు గాను మరో 14 సంవత్సరాలు జైలు శిక్షకు గురయ్యాడు.అయితే వ్యాస్కు జీవితఖైదు ఒక్కటి సరిపోదన్నారు అతని చేతిలో హత్యాచారానికి గురైన మిచెల్ సమరవీర సోదరి.
గత నెలలో లండన్లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో విచారణ సందర్భంగా అమన్ వ్యాస్ దోషిగా నిర్దారించబడ్డాడు.ఈ నేరాలన్నీ మార్చి 2009 నుంచి మే 2009 మధ్య ఈశాన్య లండన్లోని వాల్తామ్స్టోవ్ ప్రాంతాల్లో జరిగాయి.
అమన్ వ్యాస్ తెల్లవారుజామున ఒంటరిగా కనిపించే మహిళలే లక్ష్యంగా బయట తిరిగేవాడు.ఈ క్రమంలో మార్కహౌస్ రోడ్ చుట్టూ విస్తరించి వున్న వాల్తామ్స్టోమ్ ప్రాంతాన్ని తన నేరాలకు కేంద్రంగా చేసుకున్నాడు.
ఈ క్రమంలో మిచెల్ సమరవీర హత్య జరిగిన తర్వాత జూలై 2009లో వ్యాస్ భారత్కు వచ్చేందుకు వన్ వే టికెట్ బుక్ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
భారతదేశం నుంచి అతనిని యూకేకు రప్పించడానికి మెట్ పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు.2011లో వ్యాస్ న్యూజిలాండ్లో ఉన్నాడని, ఆ తర్వాత సింగపూర్లో తలదాచుకున్నాడని పోలీసులు కనుగొన్నారు.ఔట్ బౌండ్ విమానం ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు అమన్ వ్యాస్ ను భారతపోలీసులు న్యూఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు 2011 జూలైలో భారత అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు మెట్రోపాలిటిన్ పోలీసులు తెలిపారు.
2019 అక్టోబర్లో నిందితుడిని మెట్ అధికారులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి లండన్ తీసుకొచ్చారు.అక్కడ అతనిని అధికారికంగా అరెస్ట్ చేసి అభియోగాలు మోపారు.
వ్యాస్ వివరాలు నేరాస్థుల డేటా బేస్లో లేకపోవడంతో కేసు సంక్లిష్టంగా మారిందని మెట్రోపాలిటిన్ పోలీసులు వెల్లడించారు.విచారణలో భాగంగా సుమారు 1,100కి పైగా డీఎన్ఏలను విశ్లేషించగా, 1,815 అడ్రస్లకు పోలీసులు వెళ్లారు.
అలాగే నిందితుడి చిత్రాన్ని ప్రదర్శించేందుకు గాను 60,500 పోస్టర్లు ముద్రించారు.