కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల బాధ వర్ణనాతీతం.చేతిలో చిల్లిగవ్వ లేకపోగా, లాక్డౌన్ అమల్లో ఉండటంతో ఎటూ వెళ్లలేని పరిస్ధితి.
కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ ద్వారా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన మనవారిని స్వదేశానికి తీసుకొచ్చింది.కాని కొన్ని చోట్ల మాత్రం అవసరమైన పత్రాలు ఎలా సమర్పించాలో తెలియక భారతీయుల్లో అయోమయం నెలకొంది.
ఈ క్రమంలో యూఏఈలో ఉద్యోగాలు కోల్పోయి, మనో వ్యధకు గురవుతున్న భారత పౌరులకు అక్కడే స్థిరపడిన భారతీయ న్యాయవాది అండగా నిలిచారు.కేరళకు చెందిన షీలా థామస్ 25 ఏళ్ల క్రితం దుబాయ్కు వచ్చి స్థిరపడ్డారు.
వారి తల్లిదండ్రులు కేరళకు చెందినప్పటికీ.షీలా మాత్రం హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు.
ఈ క్రమంలో సుమారు 2 వేల మందికి చట్టపరమైన దస్త్రాలు, ఇతర లాంఛనాలు పూర్తి చేసేందుకు గాను షీలా ఉచితంగా సేవలందిస్తున్నారు.
కోవిడ్ 19 కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారని.వీరిలో పలువురి వీసాల గడువు సైతం ముగిసిందని షీలా థామస్ చెప్పారు.కొంతమంది భారతీయ కార్మికుల పాస్పోర్ట్లను ఇక్కడి కంపెనీలు/ యజమానులు తమ వద్దే ఉంచుకున్నారు.
దిక్కుతోచని స్ధితిలో ఉన్న వీరందరికీ సాయం చేయాలనే ఉద్దేశంతో కార్మికుల పాస్పోర్ట్లు, అవసరమైన సర్టిఫికెట్లను విడిపించేందుకు కంపెనీలతో మాట్లాడుతున్నట్లు షీలా థామస్ వెల్లడించారు.ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన సుమారు 2,200 మందికి చెందిన వారి ఫైళ్లను ఓపెన్ చేశానని ఆమె పేర్కొన్నారు.
వారు స్వదేశానికి వెళ్లేందుకు అవసరమైన పత్రాలను తయారు చేస్తున్నానని థామస్ తెలిపారు.అక్కడితో ఆగకుండా 300 మంది కార్మికులకు భోజనం పెడుతూ కడుపు నింపుతున్నారు.ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారికి అద్దె కూడా చెల్లిస్తూ.నేనున్నా అనే భరోసాను కల్పిస్తున్నారు.