దేశం కానీ దేశంలో అడుగుపెట్టినప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని వుండాలి.కానీ ఇష్టారీతిన వ్యవహరిస్తే శిక్ష తప్పదు.
ఈ విషయం తెలిసి కూడా నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ కబడ్డీ ప్లేయర్ను ఇటలీ పోలీసులు అరెస్ట్ చేశారు.డ్రగ్స్ వ్యవహారంలో జనవరి 25న సదరు కబడ్డీ ప్లేయర్ని విసెంజాలో పట్టుకున్నారు.28 ఏళ్ల ఆ వ్యక్తి తోలు పరిశ్రమలో పనిచేస్తూ తనను తాను కబడ్డీ ఆటగాడిగా మార్చుకున్నాడు.అయితే తదనంతర కాలంలో డ్రగ్స్తో మునిగి తేలాడు.ఈ క్రమంలో విజెంజాలోని ఫెలిస్ ఈ ఫార్చునాటో వీధిలో 0.75 గ్రాముల కొకైన్తో ఇతనిని ఇటాలియన్ పోలీసులు పట్టుకున్నారు.
విసెంజాలో అమల్లో వున్న కర్ఫ్యూ ఉత్తర్వులను ఈ వ్యక్తి ఉల్లంఘించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.తొలుత కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిని అరెస్ట్ చేసినప్పటికీ, ఆ తర్వాత డ్రగ్స్ను పోలీసులు కనుగొన్నారు.
నిందితుడు 17 ఏళ్ల వయసులో ఇటలీకి వచ్చాడు.తొలుత తోలు పరిశ్రమలో పనిచేసిన అతను తర్వాత కబడ్డీలో ప్రొఫెషనల్గా మారాలని అనుకున్నాడు.
విదేశాలలో ముఖ్యంగా బెల్జియం వంటి దేశాలలో ఆడటానికి ప్రొఫెషనల్ ప్లేయర్గా ఎదగాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.
కాగా, కబడ్డీ నేపథ్యంతో ఐరోపాకు వచ్చినవారు చాలా మంది వున్నారు.
భారతీయ కబడ్డీ గత పదిహేనేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది.ముఖ్యంగా ఐరోపాకు, ఇటలీ వంటి దేశాలకు భారత్తో పాటు పాకిస్తాన్లోని పంజాబ్ నుంచి పలువురు కబడ్డీ ఆటగాళ్లు వలస వచ్చారు.2011లో ఉత్తర ఇటలీలో ఉన్న ఓర్మెల్లెలో కబడ్డీ టోర్నమెంట్ జరిగింది.దీనిలో 11 జట్లు పాల్గొన్నాయి.
మరోవైపు ఇదే విసెంజాలో భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన జనవరి 25న అర్జిగ్నానోలో జరిగింది.37 ఏళ్ల బాధితుడిని మరో ఇద్దరు భారతీయులు దారుణంగా చితకబాదారు.ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.రాత్రి 10.30 గంటలకు స్థానిక కర్మాగారం వెలుపల వీధిలో రక్తపు మడుగులో పడివున్న బాధితుడిని ఓ బాటసారి కనుగొన్నాడు.దీంతో వెంటనే స్పందించిన ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు.అయితే తీవ్ర గాయాల కారణంగా అతను కొద్దిసేపటికే మరణించాడు.అతని తలపై లోతైన గాయం మరణానికి కారణం కావొచ్చని వైద్యులు భావిస్తున్నారు.