భారత్ , అమెరికా మధ్య ఉన్న ఎన్నోరకాల అంశాలలో, వాణిజ్య సంభందాలని మెరుగు పరచడంలో భారత ఐటీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్ తెలిపారు.భారత ఐటీ పరిశ్రమ అమెరికా కంపెనీల ప్రపంచ వ్యాప్త కార్యకలాపాలలో పోటీ తత్వాన్ని పెంచిందని ఆయన అన్నారు.
అమెరికాలో లక్షలాది మందికి ప్రత్యక్ష పరోక్షంగా ఉపాది కలిపించిందని తెలిపారు.
ఈ మేరకు అమెరికాలో అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులు , హెచ్ -1బి వీసాలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు.
అమెరికాలో అనేక రాష్ట్రాలలో భారత ఐటీ కంపెనీలు అనేక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని అన్నారు.ఈ మొత్తం దాదాపు 5,000 కోట్ల డాలర్ల పైమాటే నని, అమెరికా ఆర్ధిక, సాంకేతిక రంగంలో ఎదుగుతోందంటే భారత ఐటీ కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా హైటెక్ రంగంలో సుమారు 24 లక్షల మంది కొరత ఉందని హర్ష వర్ధన్ తెలిపారు.ఈ రంగంలో నిపుణులు, నైపుణ్యం కలిగిన వారి కొరత తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత రాయబారి హర్షవర్ధన్ సభలో తెలిపారు.