భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సునక్ తన మార్క్ చూపిస్తున్నారు.ఈ క్రమంలో కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్ధకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు గాను ఆయన రూ.3 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు.ఇదే సమయంలో ఆర్ధిక వ్యవస్థకు ఊపును ఇచ్చేందుకు, ప్రజల వినియోగం, వ్యయాలను పెంచేందుకు బ్రిటన్ ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించింది.
దీనికి సంబంధించి రిషి సునక్, ఆ దేశ ప్రధాన బ్యాంక్ ‘‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్’’ బుధవారం వేర్వేరుగా తమ విధానాలను ప్రకటించారు.
సంక్షోభ కాలంలో రుణ సౌకర్యాలను సులువుగా పొందడం, ద్రవ్య సాయం, రిటైల్ మరియు ఆతిథ్య రంగానికి 12 నెలల బిజినెస్ రేట్ హాలీడేను సునక్ ప్రకటించారు.
బ్రిటన్పై వైరస్ ప్రభావం గణనీయంగానే ఉందన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం తరహా పరిస్ధితి నెలకొందన్నారు.ఏ దేశంలో చూసినా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయని.
అయితే ఇదంతా తాత్కాలికమేనని, త్వరలో అంతా కుదుటపడుతుందని రిషి సునక్ ఆకాంక్షించారు.
ఈ ప్యాకేజీపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), యూకే ఇండియా బిజినెస్ ఫోరం ఛైర్మన్ జిమ్ బ్లైగ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సంక్షోభ సమయంలో ప్రభుత్వం గణనీయమైన వేగంతో పనిచేస్తోందని.ఒక ట్రిలియన్ పౌండ్ల గ్రాంట్లు, హామీలను ఛాన్సలర్ అందించారని ఆయన చెప్పారు.ప్రభుత్వ మార్గదర్శకత్వాలను నిశితంగా పరిశీలించాలని, రాబోయే కాలంలో వాణిజ్య సంస్థలతో కలిసి పనిచేయాలని బ్లైగ్ యూకేలో పనిచేస్తున్న 842 భారతీయ వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు.
330 బిలియన్ పౌండ్ల రుణం యూకే జీడీపీలో 15 శాతానికి సమానం.కోవిడ్-19 వేగవంతమైన వ్యాప్తిని ఎదుర్కొనే సమయంలో దేశం లాక్డౌన్లోకి వెళితే వ్యాపార సంస్థలకు సహాయపడటానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.లండన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు గుండెకాయ వంటి లండన్ నగరంలోని కేఫేలు, రెస్టారెంట్లపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని ఆర్దిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.
కరోనా కారణంగా యూకేలో ఇప్పటి వరకు 71 మంది ప్రాణాలు కోల్పోయారు.