స్వాతంత్య్ర సమర యోధుడు, భారతరత్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి (పరాక్రమ్ దివాస్ ) సందర్భంగా సోమవారం జాతి ఆయనకు ఘన నివాళులర్పించింది.భారతదేశంతో పాటు విదేశాల్లోనూ భారతీయులు నేతాజీకి అంజలి ఘటించారు.
అటు బ్రిటన్ రాజధాని లండన్లోని భారత హైకమీషన్ కార్యాలయంలో నేతాజీకి నివాళులర్పించింది భారతీయ కమ్యూనిటీ.ఈ కార్యక్రమానికి హైకమీషన్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, బ్రిటీష్ బెంగాలీ డయాస్పోరా సభ్యులు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయ ప్రవాసులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న విప్లవకారుల చిత్రాలతో రూపొందించిన ‘‘సంగ్రామ్’’ను హెరిటేజ్ బెంగాల్ గ్లోబల్ (హెచ్జీబీ) ప్రదర్శించింది.
ఈ సందర్భంగా యూకేలోని భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి గాంధీ హాల్ ఆఫ్ ఇండియా హౌస్లో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ సైనిక, రాజకీయ వ్యూహాలు, ధైర్య సాహసాలు చిరస్థాయిగా కొనసాగుతున్నాయన్నారు.
గృహ నిర్బంధం నుంచి తప్పించుకోవడంలోనూ ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలు.భారతదేశం వైపుగా ఆయన ప్రయాణం, యుద్ధ ఖైదీలతో సైన్యాన్ని సమీకరించడం వంటి చారిత్రక చిత్రాలను కోల్కతాలోని నేతాజీ మ్యూజియంలో చూడవచ్చని దొరైస్వామి తెలిపారు.
సుభాష్ చంద్రబోస్ తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని హైకమీషనర్ ప్రశంసించారు.
కాగా.నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ‘‘పరాక్రమ్ దివాస్’’గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.దీనిలో భాగంగా 2021 జనవరి 23 నుంచి అధికారికంగా పరాక్రమ్ దివాస్ను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు.
ఇక సోమవారం జరిగిన నేతాజీ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అండమాన్, నికోబార్ దీవుల్లోని పేరు లేని 21 దీవులకు పరమ వీర చక్ర అవార్డ్ గ్రహీతల పేర్లు పెట్టారు.
ఇప్పటికే రాస్ ఐలాండ్స్కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే.అలాగే నేతాజీ నేషనల్ మెమోరియల్ నమూనాను కూడా మోడీ ఆవిష్కరించారు.