కరోనా వైరస్ కారణంగా ప్రవాస భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.లాక్డౌన్ కారణంగా కుటుంబసభ్యులు తలో చోట ఉండిపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో పనిమీద భారత్కు వచ్చిన భర్త . లాక్డౌన్ కారణంగా ఇక్కడే చిక్కుకుపోవడంతో దేశం కానీ దేశంలో అతని భార్య పడరాని పాట్లు పడుతోంది.భారతదేశానికి చెందిన సెఫాలి పానిగ్రాహి అనే మహిళ, భర్త, తన ఇద్దరు కుమార్తెలతో కలిసి యూఏఈలోని షార్జా నగరం అల్ నహ్దా ప్రాంతంలో ఉంటోంది.ఈ క్రమంలో మార్చి 15న ఆమె భర్త వ్యక్తిగత పనులపై భారత్కు వచ్చాడు.
అతను నాలుగు రోజుల్లో తిరిగి షార్జాకు వెళ్లాల్సి వచ్చింది.అయితే పనులు ఆలస్యం కావడంతో ఇంకొన్ని రోజులు వేచి వుండాల్సి వచ్చింది.
ఇదే సమయంలో భారతదేశంలో కరోనా దూకుడు పెరగడంతో ప్రధాని నరేంద్రమోడీ లాక్డౌన్ విధించారు.దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అతను భారత్లోనే ఉండిపోయాడు.
అటు యూఏఈలో ఉన్న సెఫాలి పరిస్ధితి ఆందోళనకరంగా మారింది.నాలుగు రోజుల్లో పనిముగించుకుని వస్తానని వెళ్లిన భర్త రెండు నెలలు గడుస్తున్నా రాకపోవడంతో ఆమెకు కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో తెలియడం లేదు.
భర్త ఇచ్చిన నగదు అయిపోయింది.చేతిలో చిల్లిగవ్వ లేదు, పూట గడవటం కూడా ఇబ్బందిగా మారింది.మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా చిన్న కుమార్తె స్కూల్ ఫీజు చెల్లించాలంటూ పాఠశాల యాజమాన్యం నుంచి ఒత్తిడి పెరగడం సెఫాలిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.తన భర్త డయాబెటిస్, అస్థమాలతో బాధపడుతుండటం.
అతను వాడే మందులు భారత్లో దొరకడం కష్టం కావడంతో ఆయన ఆరోగ్యం విషయమై తాను ఆందోళన చెందుతున్నట్లు సెఫాని చెప్పింది.కాగా యూఏఈలో ఇప్పటి వరకు 32,532 మంది వైరస్ బారినపడగా.258 మంది ప్రాణాలు కోల్పోయారు.