కొన్ని రోజుల క్రితం రంగుల పేరుతో మోసాలు చేస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా స్కామ్ గురించి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.రంగులు కరెక్ట్ గా కనిపెడితే లక్షలు గెలవచ్చంటూ మోసగాళ్లు మాయమాటలు చెప్పి ఏకంగా 2,000 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగుల మోసాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సొమ్మును హవాలా మార్గం ద్వారా పంపించడానికి మోసగాళ్లు వేసిన ఎత్తులు అధికారులను సైతం అవాక్కయ్యేలా చేస్తున్నాయి.
మోసగాళ్లు ఇందుకోసం మన దేశం నుంచి చైనాకు ఎగుమతి అయ్యే పైపులు, విడి భాగాలు, ఆయుర్వేద మందులు, జుట్టు, ఇనుము వంటి వాటిని ఎగుమతి చేస్తున్న వ్యాపారులను టార్గెట్ చేశారు.చైనాలో దిగుమతి చేసుకున్న వస్తువులకు సంబంధించిన నగదును ఢిల్లీ కేంద్రంగా నడిచే లింక్ యున్, డోకీపే సంస్థలు చెల్లిస్తున్నాయి.
అయితే ఈ సంస్థలు చెల్లిస్తున్న సొమ్ము అంతా హవాలా సొమ్మేనని తెలిసి అవాక్కవ్వడం అధికారుల వంతయింది.హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ కు చెందిన ఒక డీలర్ తెలంగాణలోని పలు సెలూన్ షాపుల నుంచి జుట్టును కొనుగోలు చేసి చైనాకు ఎగుమతి చేసేవాడు. ఢిల్లీకి చెందిన సంస్థల నుంచి తాజాగా ఆ వ్యక్తి ఖాతాలో 82 లక్షల రూపాయలు జమయ్యాయి.జుట్టు కొనుగోలు చేసిన కంపెనీ చైనాలో మరో కంపెనీకి జమ చేయగా ఆ కంపెనీ ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే కంపెనీలకు సమాచారం ఇచ్చింది.
ఢిల్లీకు చెందిన రెండు కంపెనీలు హవాలా సొమ్మైన 82 లక్షల రూపాయలు అతని ఖాతాలో జమ చేశాయి.ఈ వ్యక్తి ఖాతాలో జమైన విధంగానే తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పలువురి ఖాతాలలో కోట్ల రూపాయల హవాలా సొమ్ము జమైనట్లు అధికారులు గుర్తించారు.