సింగిల్ నేమ్ పాస్పోర్ట్లకు ఇంటి పేరును చేర్చే నిబంధనలను సరళీకృతం చేయాలని యూఏఈలోని ప్రవాస భారతీయులు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్ధించారు.గత వారం యూఏఈలో తన మూడు రోజుల పర్యటన సందర్భంగా భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ను కలిసి వారు ఈ మేరకు వినతపత్రం సమర్పించారు.
ఇండియన్ కల్చరల్ ఫోరమ్ (ఐసీఎఫ్) దుబాయ్ ఆఫీస్ బేరర్లు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో వున్నారు.భారత్, యూఏఈల మధ్య సాంస్కృతి సంబంధాలను ప్రోత్సహించే ప్రవాస భారతీయుల సంక్షేమం నిమిత్తం ఐసీఎఫ్ స్థాపించబడింది.
ఇక్కడ జన్మించిన భారతీయ పిల్లల విషయంలో ఇంటి పేరును జోడించడంలో విధానపరమైన జాప్యాలు, ఖర్చులు వున్నందున
తాము ఈ సమస్యను మంత్రికి విన్నవించామని ఐసీఎఫ్ ఛైర్మన్ రమేశ్ స్థానిక మీడియాతో అన్నారు.తమ పాస్పోర్టులలో సింగిల్ నేమ్స్ (ఇంటి పేరు లేకుండా)తో వున్న ప్రయాణీకులను విమాన ప్రయాణం చేయొద్దని భారతీయ విమానయాన సంస్థలు తమకు సూచించినట్లు ఆయన చెప్పారు.
ఈ నేపథ్యంలో గత నెలలో చాలా మంది భారతీయ ప్రవాసులు పేర్లకు ముందు , వెనుక ఇంటి పేర్లను జోడించేందుకు ముందుకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
అంతేకాకుండా పాస్పోర్ట్లో వారి తండ్రి లేదా ఇంటి పేర్లను పేరుకు ముందు చేర్చడం ద్వారా విమానంలోకి అనుమతిస్తున్నట్లు రమేశ్ పేర్కొన్నారు.ఈ పరిణామం భారతీయ పాస్పోర్ట్లలో ఇంటి పేర్లను చేర్చడానికి సంబంధించిన ఆందోళనలను వెలుగులోకి తెచ్చిందన్నారు.మంత్రికి సమర్పించిన మెమొరాండంలో .యూఏఈలో జన్మించిన కొంతమంది భారతీయ పిల్లల విషయంలో, ఒకే పేర్లతో జనన ధృవీకరణ పత్రాలు ముందుగా పొందినట్లు ఐసీఎఫ్ ఎత్తి చూపింది.దీని ప్రకారం పాస్పోర్ట్లు ఇంటి పేరు లేకుండా అదే పేరుతో జారీ చేయబడ్డాయి.
పేరు మార్పుపై ప్రస్తుత మార్గదర్శకాలు కొత్తగా పెళ్లయిన మహిళలు, విడాకులు తీసుకున్న మహిళల కోసం రూపొందించబడ్డాయని మెమోరాండం ఎత్తి చూపింది.ఈ మార్గదర్శకాలను అనుసరించాల్సిందిగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రవాసులకు సలహా ఇస్తున్నాయని.కానీ ఇది అసాధ్యమని మెమోరాండంలో తెలిపారు.ఐసీఎఫ్ చెబుతున్న దానిని బట్టి పాస్పోర్ట్లలో ఇంటి పేరును జోడించడానికి దాదాపు రెండు నెలలు పడుతుంది.అయితే ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఈ సంస్థ పలు సూచనలు కూడా చేసింది.