భారత్ నుంచి వివిధ దేశాలకు ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం, వలసలు వెళ్తూ ఉంటారు.కువైట్ వంటి దేశాలకు ఉపాది కోసం వెళ్ళే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది.
అయితే కొందరు మోసగాళ్ళు కువైట్ లో ఉంటున్న భారతీయులను అధికారుల పేర్లు చెప్పి దోచు కుంటున్నట్టుగా వార్తలు రావడంతో ఇండియన్ ఎంబసీ అలెర్ట్ అయ్యింది.ఇలాంటి దాడులు జరుగుతున్న నేపధ్యంలో కువైట్ లో ఉంటున్న భారత ఎన్నారైలకు కీలక సూచనలు చేసింది.
కువైట్ లో ఉంటున్న భారతీయులకు ఫేక్ కాల్స్ చేస్తూ తాము ఎంబసీ అధికారులమని ఫోన్ చేస్తున్నారని, మీ సర్వీసుల విషయంలో లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకులేక పొతే మీపై చర్యలు ఉంటాయని చెప్పి అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారని అంతేకాదు డబ్బులు కట్టకపోతే అక్కడి జైళ్ళ లోనే మగ్గాల్సి ఉంటుందని బెదిరించడంతో ఎంతో మంది అమాయకపు వలస వాసులు భయపడి వారిచేతిలో మోస పోతున్నారని రోజు రోజుకు ఇలాంటి ఫిర్యాదులు ఎంబసీకి వస్తున్నాయని అందుకే భారతీయులను అప్రమత్తం చేస్తున్నట్టుగా ఎంబసీ అధికారులు తెలిపారు.
ఎంబసీ నుంచీ ఏ అధికారి కూడా మీకు ఫోన్ చేసి మీ వ్యక్తిగత వివరాలు అడిగి తెలుసుకోరు, అలా ఎవరైనా ఫోన్ చేస్తే కంగారుపడి మీ వివరాలు తెలుపకండి, నేరుగా ఆఫీస్ కు వస్తామని చెప్పండని అధికారులు సూచించారు.
అలాగే ఏ అధికారి కూడా మీ బ్యాంక్ ఎకౌంటు వివరాలు చెప్పమని అడుగరు, మీ ఏటీఏం కార్డ్ నెంబర్ లు చెప్పమని అడగరు అలాంటి కాల్స్ వచ్చినా ఎలాంటి వివరాలు చెప్పవద్దని అధికారులు సూచించారు.ఒక వేళ మీకు ఈ విషయంలో సందేహాలు వస్తే తప్పకుండా ఎంబసీ కి వెళ్లి ధ్రువీకరణ చేసుకున్న తరువాత తదుపరి నిర్ణయం తీసుకోమని తెలిపారు.