అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరపున బరిలో నిలిచిన జో బిడెన్కు భారతీయ సమాజంలో మద్ధతు పెరుగుతోంది.దీనికి తోడు ఉపాధ్యక్ష అభ్యర్ధిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ను ఆయన ఎంపిక చేసుకోవడం బిడెన్కు కలిసొచ్చింది.
దీంతో వారిద్దరికి అనుకూలంగా ఇండో-అమెరికన్ల ప్రచారం మెల్లగా ఊపందుకుంటోంది.ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో స్థిరపడిన అనేక మంది ప్రవాస భారతీయులు బిడెన్- హారిస్కే ఓటు వేయాలంటూ పిలుపునిస్తున్నారు.
తాజాగా భారత సంతతికి చెందిన అజయ్ జైన్ భుటోరియా, ఆయన భార్య వినీతా భుటోరియాలు జో బిడెన్కు మద్ధతు తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీని గెలిపించాలని వారిద్దరూ ఇండియన్ అమెరికన్ సమాజానికి పిలుపునిచ్చారు.
‘‘ అమెరికా కా నేత కైసా హో… జో బిడెన్ జైసా హో ( అమెరికా నేత అంటే ఎలా ఉండాలంటే జో బిడెన్ లా ఉండాలి ) అంటూ ఈ దంపతులు తమ పూర్తి మద్ధతు తెలియజేశారు.
అనంతరం ఇదే వీడియోలో భారత సంతతికి చెందిన వివిధ భాషల వారు బిడెన్- హారిస్కు మద్ధతునిస్తూ నినదించారు.వీరిలో తెలుగు వాళ్లు కూడా ఉన్నారు.కాగా జో బిడెన్కు మద్ధతుగా మరో రెండు ప్రచార వీడియోలను రూపొందించి, సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు అజయ్ భుటోరియా దంపతులు వెల్లడించారు.
ప్రస్తుత వీడియోను న్యూయార్క్లోని ‘‘ఆసమ్ టీవీ’’ అధినేత రితీశ్ రూపొందించారు.మరోవైపు మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, ఫ్లోరిడా, మిచిగాన్, నెవడా రాష్ట్రాల్లోని అనేక మంది భారతీయులు తమ ఓటు బిడెన్- హారిస్కేనంటూ ప్రకటించారు.