పొట్ట చేతబట్టుకుని దేశం కాని దేశం వెళ్లి కార్మికుడిగా జీవితం గడుపుతున్న ఓ తెలంగాణా వాసికి ఊహించని కష్టం ఎదురయ్యింది.కడుపు నింపుకోవడానికి వలస కార్మికుడిగా దుబాయ్ వెళ్తే ఊహించని రీతిలో అనారోగ్యం బారిన పడి ఆస్పత్రి పాలయ్యాడు.ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఆసుపత్రి వర్గాలు సుమారు ఆరు నెలల ట్రీట్మెంట్ తరువాత అతడికి రూ.3.40 కోట్లు బిల్లు వేసి షాక్ ఇచ్చింది.దాంతో ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న అతడి కుటుంభ సభ్యులు సన్నిహితులకు గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అండగా నిలిచింది.
వివరాలలోకి వెళ్తే…
తెలంగాణా రాష్ట్రం జగిత్యాల జిల్లాకు చెందిన గంగారెడ్డి అనే వ్యక్తి డిసెంబర్ -2020 న అనారోగ్యం కారణంగా దుబాయ్ లో ఓ ఆసుపత్రిలో చేరారు.ఉన్నట్టుండి పక్షవాతం రావడంతో బ్రెయిన్ ఆపరేషన్ మొదలు పెట్టారు.
ఈ క్రమంలోనే అతడు కోమాలోకి వెళ్ళగా సుమారు ఆరు నెలల తరువాత కోమా నుంచీ బయటకు వచ్చారు.తరువాత 3 నెలలు చికిత్స చేశారు వైద్యులు.అయితే మొత్తం చికిత్స కు గాను గంగారెడ్డి కి రూ.3.40 కోట్ల బిల్లు చూపించేసరికి షాక్ అయ్యాడు.ఇంత పెద్ద మొత్తంలో బిల్లు కట్టాలంటే అతడి శక్తి కి మించిన భారం కావడంతో గల్ఫ్ కార్మికుల రక్షణ సమితికి తన పరిస్థితిని చెప్పడంతో…
సమితి అధ్యక్షుడు గుండెల్లి నరసింహ వెంటనే స్పందించారు.
గంగారెడ్డి ని కలిసి ధైర్యం చెప్పారు.కుటుంభ సభ్యులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చిన నరసింహ ఆయన పరిస్థితిని ఇండియన్ కాన్సులేట్ కు చెప్పడంతో కాన్సులేట్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసింది.
వెంటనే స్పందించి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి బిల్లును మాఫీ చేయించింది.అంతేకాదు గంగారెడ్డి కోసం ప్రత్యేక ఎయిర్ అబులెన్స్ ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపి అక్కడి నుంచీ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ఇదిలాఉంటే గంగారెడ్డి కుటుంభ సభ్యులు గల్ఫ్ కార్మికుల సమితికి ఇండియన్ కాన్సులేట్ కు కృతజ్ఞతలు తెలిపారు.