ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు మరోవైపు ఏపీలో ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నికలపై సీరియస్ గా దృష్టిపెట్టింది.ఇప్పటివరకు జరిగిందేదో జరిగిపోయింది… ఇక జరగాల్సిందే మిగిలి ఉంది అన్నట్టుగా… హైకమాండ్ కూడా అకస్మాత్తుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులను….
ఢిల్లీ కి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.వీరితో పాటు తెలంగాణాలో కొత్తగా ఎన్నికైన 19 మంది ఎమ్యెల్యేలు కూడా ఢిల్లీ టూర్ కి సిద్ధం అయ్యారు.
వీరితో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చర్చించనున్నారు.అందులో భాగంగా ఇవాళ సాయంత్రం 5గంటలకు ఏపీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి రాహుల్తోనూ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి ఉమెన్ చాందీతోనూ భేటీ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీల నియామకాలపై ప్రతిపాదనలను కూడా ఈ సందర్భగా రాహుల్కి ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.అలాగే… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిగతా చిన్న చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లినా… ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయిందని అధిష్టానం ఆగ్రహంగా ఉంది.ఇవే విషయాలను చర్చించడానికి తెలంగాణ అగ్రనాయకులు, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయంలో స్పష్టమైన క్లారిటీ తెచ్చుకునేందుకు ఏపీకి చెందిన కీలక నాయకులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇప్పటివరకు వీరికి రాహుల్ అపాయింట్మెంట్ దక్కలేదు.
ప్రస్తుతం ఇప్పుడు ఆ అవకాశం రావడంతో స్పష్టమైన క్లారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు.
ఈ భేటీలో ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం ఫలించకపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో వ్యూహాన్ని మార్చడానికి అధిష్టానం ప్లాన్ చేస్తోంది.అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం కారణంగా … కార్యకర్తల్లో ఉన్న నిరుత్సాహాన్ని పోగొట్టడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
పార్లమెంటు ఎన్నికల్లో పూర్వ వైభవం తేవడానికి అనుసరించాల్సిన వ్యూహాలను కాంగ్రెస్ నేతలు హైకమాండ్కు వివరించనున్నారు.ఏపీలో విభజన హామీల అమలులో కేంద్రం వైఫల్యం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని ఫోకస్ చేసి రాష్ట్రంలో పూర్వవైభవం కోసం నేతలు ప్రయత్నించనున్నారు.
ఇక తెలంగాణలో టీఆర్ఎస్ను కాకుండా బీజేపీని టార్గెట్గా ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ సీట్లు సాధించొచ్చన్న భావనలో అధిష్టానం దిశానిర్ధేశం చేయబోతున్నట్టు తెలుస్తోంది.