అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావిడి ప్రారంభమైన నాటి నుంచి ఏ విషయంలో చూసినా అధ్యక్షుడు ట్రంప్ కంటే డెమొక్రాటిక్ నేత జో బిడెన్ ముందంజలో వుంటున్నారు.అలాగే భారతీయుల సత్తాను గుర్తించి వారిని ఆకట్టుకునే విషయంలోనూ బిడెన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
భారత సంతతికి చెందిన కమలా హారిస్ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించి రిపబ్లికన్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.ఒక్క ఈ నిర్ణయంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయుల దృష్టిని బిడెన్ ఆకర్షించగలిగారు.
అలాగే అధ్యక్ష అభ్యర్ధుల మధ్య ఆనవాయితీగా వస్తున్న డిబేట్లో సైతం బిడెన్ స్పష్టమైన అవగాహనతో మాట్లాడారు.వీటన్నింటి వెనుక ఇద్దరు భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
వారిలో ఒకరు డాక్టర్ వివేక్ మూర్తి కాగా, మరొకరు ఆర్ధికవేత్త రాజ్ చెట్టి. వీరిద్దరూ బిడెన్కు చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలు ఇస్తున్నారు.
ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం, దేశంలో ఆర్ధిక వ్యవస్ధ పునరుజ్జీవం, విదేశాంగ విధానంపై సలహాలు అందిస్తున్నారు.కోవిడ్ నేపథ్యంలో ప్రజారోగ్యంపై జరుగుతున్న చర్చల్లో వివేక్ మూర్తి మరో సలహాదారు డాక్టర్ కెస్లర్తో కలిసి బిడెన్కు సలహాలు అందించారు.
వీరిద్దరూ ప్రతిరోజూ తాజా పరిస్ధితిని బిడెన్కు వివరిస్తూ చర్చలు ప్రభావవంతంగా సాగేలా చూశారు.ఈ క్రమంలో వీరు సైతం కరోనా బారిన కూడా పడ్డారు.
అయినప్పటికీ జూమ్ యాప్ ద్వారా సలహాలు ఇస్తూనే వచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధికారంలో ఉన్నప్పుడు 2014లో అత్యంత చిన్నవయసు సర్జన్ జనరల్గా వివేక్ మూర్తి రికార్డుల్లోకెక్కారు.43 సంవత్సరాల వివేక్ మూర్తి కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఉన్న హళెగెరె గ్రామానికి చెందిన వారు.వివేక్ మూర్తి తాత హెచ్టీ నారాయణ శెట్టి.
కర్ణాటకలో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత.అలాగే, కర్ణాటక మాజీ సీఎం, దివంగత దేవరాజ్ ఉరుస్కు అత్యంత సన్నిహితుడు కూడా.వివేక్ మూర్తి గురించి తెలిసిన హళెగెరె గ్రామస్తులు.తమ వూరి బిడ్డ సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్ధిక వ్యవస్ద పునరుజ్జీవానికి సంబంధించి హార్వార్డ్ ఆర్ధికవేత్త అయిన రాజ్ చెట్టి కూడా బిడెన్కు అద్భుతమైన సలహాలు అందించారు.గత ఏడేళ్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ, కరోనా తర్వాత పునరుజ్జీవానికి అవసరమైన చర్యలపై బిడెన్ గతంలో ఫెడరల్ రిజర్వ్ కోసం పనిచేసిన రాజ్తో పాటు జానెట్ యెల్లెన్పై ఎక్కువగా ఆధారపడుతున్నారు.