ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్( Amritpal Singh ) వ్యవహారం భారత్తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపుతోంది.ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగుతున్నారు.ఇప్పటికే యూకే, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాలలో ఖలిస్తాన్ మద్ధతుదారులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.
భారత్ హెచ్చరికలతో ఆయా ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.భారత దౌత్య కార్యాలయాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశాయి.
ఇదిలావుండగా.అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో( San Francisco ) వున్న భారతీయ కాన్సులేట్ కార్యాలయంపై ఖలిస్తాన్ వేర్పాటువాదుల దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్కడి ఇండియన్ కమ్యూనిటీ స్పందించింది.భారత దౌత్య సిబ్బందికి, భారతదేశానికి మద్ధతుగా శాంతి ర్యాలీ నిర్వహించారు.శాన్ఫ్రాన్సిస్కోతో పాటు సమీప ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు త్రివర్ణ పతాకం చేతబూని, భారత్ మాతా కీ జై అనే నినాదాలతో హోరెత్తించారు.ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో తాజా ర్యాలీకి స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
విషయం తెలుసుకున్న కొందరు ఖలిస్తాన్ అనుకూల వాదులు అక్కడికి చేరుకుని ఖలిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.దీనికి ప్రతిగా భారతీయులు వందేమాతరం నినాదాలు చేస్తూ కౌంటరిచ్చారు.
ఇకపోతే.కెనడాలోని అంటారియో ప్రావిన్స్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్ వాదులు ధ్వంసం చేశారు.హామిల్టన్ పట్టణంలోని సిటీ హాల్లో సమీపంలో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.గాంధీ విగ్రహం 2012 నుంచి ఈ ప్రాంతంలోనే వుంది.ఆరు అడుగుల ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వం బహుమతిగా ఇచ్చింది.గాంధీ విగ్రహంపై గ్రాఫిటీతో ప్రధాని నరేంద్ర మోడీపై విద్వేషపూరిత వ్యాఖ్యలను రాశారు.
అనంతరం విగ్రహం పక్కనే ఖలిస్తానీ జెండాను ఎగురవేశారు దుండగులు.అయితే విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు విగ్రహం వద్ద పిచ్చిరాతలు చెరిపివేసి, శుభ్రం చేశారు.
కాగా.గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై స్థానిక భారతీయ కమ్యూనిటీ భగ్గుమంది.