అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.ఇప్పటికే పలు సంస్థలు జనం నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇక అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే భారతీయ అమెరికన్లు ఈసారి కూడా తమ జడ్జిమెంట్ ఎవరికి ఇస్తారోనని స్థానికుల్లో ఆసక్తి నెలకొంది.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం నిర్వహించిన సర్వేలో కీలక రాష్ట్రాల్లో ఇండో అమెరికన్లు ట్రంప్ వైపే మొగ్గుచూపుతున్నట్లుగా తేలింది.
తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కు మద్ధతు తెలుపుతూ పలువురు భారతీయ అమెరికన్లు ఓ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు.ఇక నుంచి ఈ కమిటీ ఆధ్వర్యంలో వీరంతా ట్రంప్కు మద్ధతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ కమిటీకి ఏడీ.అమీర్ నేతృత్వం వహిస్తారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ట్రంప్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అమీర్ ప్రశంసించారు.దేశీయంగా, అంతర్జాతీయంగా అనేక సవాళ్లను అధిగమించి.ఉగ్రవాదంపై తిరుగులేని పోరాటం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.వలస విధానాన్ని క్రమబద్ధీకరిండంతో పాటు దేశ ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టడానికి అనేక చర్యలు తీసుకున్నారని అమీర్ గుర్తుచేశారు.
ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలంటే ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాలని ఆయన ఆకాంక్షించారు.కాగా 2016లో తొలిసారి అధ్యక్ష బరిలో నిలిచినప్పుడు కూడా అమీర్ ట్రంప్కు మద్ధతుగా కమిటీని ఏర్పాటు చేశారు.