2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.
అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.
నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు. 2020 చివరి నాటికి ఏవో కొన్ని దేశాలు తప్పించి.అంతగా వైరస్ ఉద్ధృతి లేకపోవడం అదే సమయంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ఇక ముప్పు తప్పినట్లేనని అంతా భావించారు.
కానీ ఉత్పరివర్తనం చెంది .ఎన్నో రెట్లు శక్తిని పుంజుకుని మానవాళిపై దాడి చేయడం ప్రారంభించింది కోవిడ్.ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వంటి దేశాలు సెకండ్ వేవ్తో విలవిలలాడిపోతున్నాయి.ఈ క్రమంలో కరోనాకు కళ్లెం వేయాలంటే దేశాల భాగస్వామ్యం, పరస్పర సహకారం, కార్పోరేట్ శక్తుల చేయూత వంటి అంశాలే ప్రధాన భూమికను పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కోవిడ్పై పోరులో భాగంగా ‘గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఆన్ పాండమిక్ రెస్పాన్స్’ పేరిట అమెరికా ఓ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఇందులో అన్ని రంగాల ప్రముఖులు సభ్యులుగా వున్నారు.
ఇంతటి ప్రతిష్టాత్మక కమిటీలో భారత సంతతికి చెందిన ముగ్గురు ప్రముఖులకు చోటు దక్కింది.వారే గూగుల్ సీఈవో సుందర్ పిచయ్, డెలాయిట్ సీఈవో పునిత్ రెంజన్, అడోబ్ సీఈవో శంతను నారాయణ.
ఈ జాబితాలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సీఈవో మార్క్ సుజ్మన్, బిజినెస్ రౌండ్టేబుల్ అధ్యక్షుడు, సీఈవో, యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో జోషువా బోల్టన్ కూడా సభ్యులుగా ఉన్నారు.గ్లోబల్ టాస్క్ ఫోర్స్ను యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇటీవల ప్రభుత్వ- ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.కరోనాను కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు యుఎస్-భారత్ బిజినెస్ కౌన్సిల్, యుఎస్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్స్తో కలిసి పనిచేయనుంది.
ఇప్పటికే అమెరికాలోని కార్పొరేట్ దిగ్గజాలు ఉమ్మడిగా 25 వేలకు పైగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను భారత్కు ఇచ్చిన సంగతి తెలిసిందే.
డెలాయిట్ అందించిన తొలి వెయ్యి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు.ప్రముఖ రవాణా సంస్థ ఫెడెక్స్ సహకారంతో గత నెల 25న భారత్కు చేరుకున్నాయి.అదే విధంగా వెంటిలేటర్లు కూడా చేరాయి.మొత్తంగా వెయ్యి వెంటిలేటర్లను జూన్ 3 నాటికి భారత్కు అందించనున్నారు.
ఈ టాస్క్ఫోర్స్లో ఈ- కామర్స్, రిటైల్, ఫార్మా, టెక్, తయారీ రంగాల పరిశ్రమలు పాలు పంచుకుంటున్నాయి.ఈ టాస్క్ఫోర్స్ ప్రతినిధులు.
అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.కాగా, భారత్ను ఆదుకునేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలు సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్లు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే.