వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల క్రితమే అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.
ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్, నార్త్ కరోలినా తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.
అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.
ఇక ఎన్నికల్లో జో బైడెన్ గెలిస్తే పెద్ద సంఖ్యలో భారతీయులకు కీలక పదవులు దొరుకుతాయన్న విశ్లేషకుల మాట అక్షరాల నిజమైంది.ఇండో అమెరికన్ల సత్తాపై మంచి గురి వున్న బైడెన్.
ఉపాధ్యక్ష పదవి సహా అత్యున్నత పదవులను కట్టబెట్టారు.ఇప్పటి వరకు బైడెన్ టీంలో దాదాపు 55 మంది ప్రవాస భారతీయులకు పదవులు దక్కాయి.
రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు.ఈ నేపథ్యంలో భారతీయులు అమెరికాపై ఆధిపత్యం వహిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బైడెన్.
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) శాస్త్రవేత్తలతో వర్చువల్ మీట్లో మాట్లాడుతూ ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
దేశంలో భారత సంతతి నానాటీకి విస్తరిస్తోందన్న ఆయన.వారు అమెరికాపై ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పారు.మీరు ( నాసా శాస్త్రవేత్త స్వాతిమోహన్), ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, నా స్పీచ్ రాసిన వినయ్ రెడ్డి అంతా భారతీయులేనని అధ్యక్షుడు పేర్కొన్నారు.
ఇక నాసా మార్స్ మిషన్ 2020 (గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ ఆపరేషన్స్)కు నాయకత్వం వహిస్తోన్న స్వాతి మోహన్ని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.ఇంతమంది భారత సంతతి ప్రజలు ప్రజా సేవలో నిమగ్నమై వుండటం ముచ్చటగా వుందని బైడెన్ కొనియాడారు.
కాగా 55 మంది భారతీయులకు విజయవంతంగా పదవులు కల్పించిన ఆయనకు ఒక్క నీరా టాండన్ విషయంలోనే ఎదురుదెబ్బ తగిలింది.బడ్జెట్ చీఫ్గా ఆమె నియామకంపై మద్దతు కూడగట్టడంలో బైడెన్ కేబినెట్ విఫలమైంది.నీరా టాండన్ నియామకాన్ని ధ్రువీకరించడానికి అవసరమైన ఓట్లు సెనేట్లో పొందడం అసాధ్యమని తేలిపోవడంతో ఆమె నియామకంపై బైడెన్ వెనక్కి తగ్గారు.గత్యంతరం లేని పరిస్దితుల్లో నీరా టాండన్ వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఓఎంబీ) డైరెక్టర్ పదవికి నామినేషన్ను ఉపసంహరించుకున్నట్టుగా మంగళవారం అధ్యక్షుడికి లేఖ రాశారు.