ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ‘స్పెల్ బీ’ కాంటెస్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది.పిల్లల్లో ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే ఈ పోటీలకు విద్యార్ధులు, తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
ఈ క్రమంలో స్పెల్ బీ తరహాలోనే కొత్తగా ప్రారంభించిన స్పెల్ పండిట్ పోటీలో భారతీయ అమెరికన్ విద్యార్ధులు సత్తా చాటారు.
మధ్య ఆసియాలో వినియోగించే ప్రాచీనమైన గొలుసుకట్టు లిపి అయిన ‘‘కరోస్థి’’ (KAROSHTHI) స్పెల్లింగ్ను కరెక్ట్గా చెప్పి 14 ఏళ్ల నవ్నీత్ మురళీ విజేతగా నిలిచాడు.
ఈ మేరకు న్యూయార్క్ డైలీ న్యూస్ కథనాన్ని ప్రచురించింది.మురళీ న్యూజెర్సీలోని ఎడిసన్లో 8వ తరగతి చదువుతున్నాడు.ఇక ఇదే పోటీలో రెండో స్థానాన్ని సైతం భారత సంతతి బాలిక నిధి అచంటను వరించింది.ఈమె కూడా ఎనిమిదో తరగతి చదువుతోంది.
ఆరో తరగతి చదువుతున్న హరిణీ లోగాన్కు తృతీయ స్థానం దక్కినట్లు స్పెల్ పండిట్ సహ వ్యవస్థాపకుడు సౌరవ్ దాసరి తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా భారతీయ అమెరికన్లే విజేతలుగా నిలుస్తూ వస్తోన్న ప్రతిష్టాత్మక స్పెల్ బీ పోటీలు కోవిడ్ 19 కారణంగా ఈ ఏడాది రద్దయ్యాయి.రెండవ ప్రపంచయుద్ధం అనంతరం ఈ పోటీలు రద్దవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.స్పెల్ పండిట్లో విజయం సాధించిన మురళీకి 3,000 డాలర్ల బహుమతి లభించింది.