అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి నాటి నుంచి భారత సంతతి నిపుణులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తోన్న జో బైడెన్.తన జోరును ఏ మాత్రం తగ్గించడం లేదు.
తాజాగా మరో భారత సంతతి మహిళను కీలక పదవి కోసం నామినేట్ చేశారు.ఇండియన్ అమెరికన్ న్యాయవాది.
సర్క్యూట్ కోర్టు చీఫ్ జడ్జి శాలిన డీ కుమార్ను మిచిగాన్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫెడరల్ జడ్జిగా బైడెన్ బుధవారం నామినేట్ చేశారు.ప్రస్తుతం ఆమె ఓక్లాండ్ కౌంటీ ఆరవ సర్క్యూట్ కోర్టు చీఫ్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు.
2007 ఆగస్టు 20న మిచిగాన్ మాజీ గవర్నర్ జెన్నీఫర్ గ్రాన్హోం శాలినను ఓక్లాండ్ కౌంటీ ఆరవ సర్క్యూట్ కోర్టు చీఫ్ జడ్జిగా నియమించారు.అంతకుముందు ఈ పదవిలో ఉన్న జడ్జి జీన్ ష్నెల్జ్ పదవీ విరమణ చేయడంతో ఆమె స్థానంలో శాలిన చీఫ్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.
నాటి నుంచి ఆమె ఈ పదవిలో కొనసాగుతున్నారు.కాగా, మిచిగాన్ కోర్టు ఫెడరల్ జడ్జిగా నామినేట్ అయిన తొలి దక్షిణాసియా మహిళగా శాలిన చరిత్ర సృష్టించారని వైట్హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది.
శాలిన 1993లో మిచిగాన్ యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.అనంతరం అనంతరం 1996లో డెట్రాయిట్ యూనివర్శిటీలోని మెర్సీ స్కూల్ ఆఫ్ లా నుంచి న్యాయవాద డిగ్రీ పూర్తి చేశారు.
న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించన శాలిన వివిధ హోదాల్లో పనిచేశారు.అడల్ట్ ట్రీట్మెంట్ కోర్ట్ చీఫ్ జస్టిస్గా, ఓక్లాండ్ కౌంటీ క్రిమినల్ అసైన్మెంట్ కమిటీ ఛైర్పర్సన్, ఓక్లాండ్ కౌంటీ బార్ అసోసియేషన్ సర్క్యూట్ కోర్ట్ కమిటీకి బెంచ్ సమన్వయకర్త, మిచిగాన్ స్టేట్ బార్ ప్రొఫెషనలిజం కమిటీ సభ్యురాలిగా, మిచిగాన్ జడ్జిల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా శాలిన బాధ్యతలు నిర్వర్తించారు.
కొద్దిరోజుల క్రితం ఇండియన్-అమెరికన్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సరళా విద్యా నాగాలాను కనెక్టికట్ రాష్ట్రానికి ఫెడరల్ జడ్జిగా జో బైడెన్ ప్రతిపాదించారు.నాగాలాతో పాటు, మరో నలుగురు కొత్త అభ్యర్థులను ఫెడరల్ శాఖకు, ఇద్దరిని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా కోర్టులకు బైడెన్ నామినేట్ చేశారు.
అమె నియామకం ఖరారైతే… దక్షిణాసియాకు చెందిన తొలి ఫెడరల్ జడ్జి అవుతారు.సరళా ప్రస్తుతం కనెక్టికట్ జిల్లాలోని యుఎస్ అటార్నీ కార్యాలయంలో మేజర్ క్రైమ్స్ యూనిట్కు డిప్యూటీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు.2017 నుండి ఆమె ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.2012లో యుఎస్ అటార్నీ కార్యాలయంలో చేరిన ఆమె… హేట్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు.2008లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బర్కిలీ స్కూల్ ఆఫ్లాలో జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని పొందిన సరళ 2009లో జడ్జి సుషాన్ గ్రాబేర్ వద్ద క్లర్క్గా వ్యవహరించారు.