అమెరికా రాజకీయాల్లో భారతీయులు దూసుకుపోతున్నారు.ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులుగా , సెనేటర్లుగా ఎన్నికైన ఇండో అమెరికన్లు అక్కడి స్థానిక సంస్థల బరిలోనూ నిలిచారు.
వీరికి ప్రవాస భారతీయ సంఘాలు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాయి.తాజాగా న్యూజెర్సీలోని ఎడిసన్ నగర మేయర్ పదవికి పోటీపడుతున్న సామ్ జోషి డెమొక్రాటిక్ ప్రైమరీలో విజయం సాధించినట్లుగా తెలుస్తోంది.
అనధికారిక ఫలితాల ప్రకారం జోషికి 5,955 ఓట్లు పోలవ్వగా.అతని తోటి ప్రత్యర్ధి, ఎడిసన్ డెమొక్రాటిక్ ఛైర్మన్ మహేశ్ భాగియాకు 3,185 ఓట్లు, ఆర్ధర్ ఎస్పోసిటోకు 546 ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది.
దీంతో ఎన్నికల్లో జోషి.రిపబ్లికన్ అభ్యర్ధి డబ్ల్యూ.
కీత్ హాన్తో తలపడనున్నారు.నవంబర్ 2న ఇక్కడ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
అయితే మిడిల్సెక్స్ కౌంటీ బోర్డ్ ఆఫ్ ఎలక్షన్స్ ధృవీకరించే వరకు పైన వెల్లడించిన ఎన్నికల ఫలితాలు అధికారికం కాదు.బోర్డ్ జూన్ 22న ఫలితాలను వెల్లడించే అవకాశాలు వున్నాయి.
డెమొక్రాటిక్ ప్రైమరీలో విజయంపై జోషి మాట్లాడుతూ.కొత్త శకంలోకి అడుగుపెట్టేందుకు సమయం ఆసన్నమైందన్నారు.ఎడిసన్ను నడిపించే అవకాశాన్ని పొందేందుకు తాను ఉత్సాహంగా వున్నానని సామ్ జోషి తెలిపారు.తన ప్రచార బృందం, డెమొక్రాటిక్ నాయకులు, అండగా నిలిచిన ఎడిసన్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
తమ సమాజంలో సానుకూల ప్రభావం చూపడానికి నేను మేయర్ కోసం పోటీ పడుతున్నానని జోషి తెలిపారు.తన అనుభవాన్ని, విద్యను ఉపయోగించి మేయర్గా కొత్త టౌన్షిప్కు మాస్టర్ప్లాన్ను రూపొందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
స్మార్ట్ గ్రోత్ పెట్టుబడులకు ప్రాధాన్యత, చౌకైన ఇంటర్నెట్, అధిక పన్నులను తగ్గించి మున్సిపల్ ఆస్తుల విలువను పెంచేందుకు కృషి చేస్తానని సామ్ జోషి స్పష్టం చేశారు.
27 ఏళ్ల సామ్ జోషి మేయర్ పదవి కోసం డెమొక్రాట్ కీలక నేతల నుంచి ఎండార్స్మెంట్లు పొందారు.ప్రస్తుతం ఎడిసిన్ సిటి కౌన్సిల్కి ఆయన వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు.కౌన్సిల్లో చేరకముందు జోషి 2016-2017లో జోనింగ్ బోర్డ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్లో, 2010-2014 వరకు ఫెయిర్ రెంటల్ హౌసింగ్ అథారిటీలో పనిచేశారు.
మరోవైపు డెమొక్రాటిక్ ప్రైమరీ కోసం పోటీపడిన సామ్ జోషి ప్రత్యర్ధి, మహేశ్ భాగియాను ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ సీనియర్స్ అసోసియేషన్స్ ఆఫ్ నార్త్ అమెరికా చైర్మన్ దీపక్ షా ఎండార్స్ చేశారు.కరోనా సమయంలో భాగియా తన పెద్ద మనసును చాటుకున్నారు.
పెద్ద ఎత్తున ఫుడ్ ప్యాంట్రీలను నిర్వహించడంతో పాటు వృద్ధులు, ఫ్రంట్లైన్ హెల్త్కేర్ వర్కర్లకు పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.