కరోనా మహమ్మారి వల్ల ఆర్ధికంగా, సామాజికంగా ఎంతో నష్టపోయిన అమెరికన్లను ఆదుకునేందుకు గాను జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక ప్యాకేజ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.ద అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ పేరుతో ప్రకటించిన ఈ బిల్లుకు ఇటీవల సెనేట్, అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం తెలిపాయి.దీంతో ఈ ప్యాకేజ్ ఫలాలను ప్రజలకు పంచడం ప్రారంభించింది ఫెడరల్ ప్రభుత్వం.
ఈ నిధులతో కరోనా పరీక్షల నిర్వహణ, టీకా కార్యక్రమాలతో పాటు.పౌరులకు నేరుగా ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు అండగా నిలవడం వంటి కార్యక్రమాలు చేపడతామని బైడెన్ ఇప్పటికే తెలిపారు.
దీని ద్వారా సుమారు 400 బిలియన్ డాలర్లు అమెరికన్లకు ఆర్థిక సాయంగా అందనుంది.ఏడాదికి 75వేల డాలర్లు సంపాదిస్తున్న ఒక్కొ అమెరికన్ పౌరుడి ఖాతాలో నేరుగా 1400 డాలర్లు (సుమారు రూ.లక్ష) జమ చేయనున్నారు.దీనిలో భాగంగా మార్చి 14 నుంచి 1400 డాలర్ల పంపిణీని ప్రారంభించినట్లు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) వెల్లడించింది.
ఈ పేమెంట్లను నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తున్నట్లు ఐఆర్ఎస్ పేర్కొంది.అలాగే ఈ ప్యాకేజీ ద్వారా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు 350 బిలియన్ డాలర్లు.నిరుద్యోగులకు సెప్టెంబర్ వరకు ప్రతి వారం 300 డాలర్ల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తారు.దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్, టెస్టుల కోసం మరో 50 బిలియన్ డాలర్లు కేటాయించనున్నారు.
అయితే బైడెన్ కంటే ముందే అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ చిన్న, సూక్ష్మతరహా వ్యాపారాలను ఆదుకోవడానికి గాను ‘‘పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’’ అనే రిలీఫ్ స్కీమ్ను గతేడాది ప్రారంభించారు.దీని ద్వారా వ్యాపారాలను నిలబెట్టడంతో పాటు ఆయా సంస్ధల్లో పనిచేసే కార్మికులు రోడ్డున పడకుండా వారికి వేతనాలు చెల్లించాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం.
అయితే చిరు వ్యాపారులకు కాస్తయినా ఉపశమనం కలిగించాలన్న ప్రభుత్వ ఆలోచనను కొందరు మోసగాళ్లు తమ స్వార్ధానికి ఉపయోగించుకుంటున్నారు.ఇందులో భారతీయులు కూడా ఉండటం దురదృష్టకరం.టెక్సాస్లో స్థిరపడిన ఓ ఇండో అమెరికన్ కొవిడ్ రిలీఫ్ స్కీమ్లో 24.8 మిలియన్ డాలర్లు (రూ.180 కోట్లు) మోసానికి పాల్పడినట్లు అమెరికా న్యాయ శాఖ తేల్చింది.
దినేష్ షా (55) 15 బోగస్ పత్రాలను ఉపయోగించి వివిధ బ్యాంకుల నుంచి ‘పే చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం‘ (పీపీపీ) ద్వారా మోసపూరితంగా సుమారు రూ.180 కోట్లు పొందాడు.తనకు పలు రకాల వ్యాపారాలున్నాయని చెప్పి వివిధ వ్యక్తుల పేరు మీద దినేష్ భారీగా దండుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
అలా పొందిన సొమ్ముతో అతను విలాసవంతమైన కార్లు, ఇళ్లను కొనుగోలు చేయడంతో పాటు జల్సాలు చేసినట్లు న్యాయశాఖ వెల్లడించింది.ఈ కేసుకు సంబంధించి దినేష్ను యూఎస్ న్యాయ విభాగం ముందు హాజరుపరచగా ఆయన నేరాన్ని అంగీకరించారు.
ప్రస్తుతం విచారణ దశలో వున్న ఈ కేసులో దినేశ్ నేరం రుజువవ్వడంతో శిక్ష భారీగానే పడే అవకాశం వుంది.