కోవిడ్ సెకండ్ వేవ్తో అల్లాడిపోతున్న భారతదేశాన్ని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొస్తూనే వున్నారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో జన్మభూమికి అండగా నిలబడుతున్నారు.
ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం అమెరికాలోని దక్షిణ కాలఫోర్నియాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన సంస్థలు, వ్యాపార యజమానులు పెద్ద ఎత్తున నిధులను సేకరించి వాటి సాయంతో అవసరమైన వస్తువులను పంపిన సంగతి తెలిసిందే.
తాజాగా అట్లాంటాకు చెందిన ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ (ఏఏహెచ్ఓఏ) సైతం భారత్ను ఆదుకోవడానికి ముందుకు వచ్చింది.ఈ అసోసియేషన్ ఛైర్మన్ మైఖేల్ పటేల్ మాట్లాడుతూ.
కరోనా సెకండ్ వేవ్ వల్ల భారత్లో చోటు చేసుకున్న సంక్షోభాన్ని చూస్తుంటే పరిస్ధితి చాలా వేగంగా క్షీణిస్తుందని భావించామన్నారు.గతంలో భారత్లోని పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాల కోసం కచేరీలు, కార్యక్రమాలు జరిగాయని పటేల్ తెలిపారు.
అమెరికాలో పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ.పెద్ద ప్రదర్శనలను నిర్వహించడం సాధ్యంకాదన్నారు.
అందువల్ల సోషల్ మీడియా, ఇతర కమ్యూనిటీ నెట్వర్క్ల సాయం తీసుకుంటున్నట్లు మైఖేల్ పటేల్ పేర్కొన్నారు.అమెరికాలోని హోటళ్లు, డాక్టర్లతో పాటు ప్రవాసుల నుంచి తమకు పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోందని ఆయన తెలిపారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన మైఖేల్ పటేల్.వైట్హౌస్లో కమీషనర్గా పనిచేశారు.
భారత సంతతికి చెందిన మరో హోటల్ యజమాని బీయూ పటేల్ నేతృత్వంలోని జాయ్ ఆఫ్ షేరింగ్ ఫౌండేషన్, రోటరీ ఇంటర్నేషనల్, ఇతర స్వచ్ఛంద సంస్థలు తమకు సాయం చేస్తున్నాయని మైఖేల్ పటేల్ వెల్లడించారు.తాము పంపించే వైద్య పరికరాలు, ఆహారం, మందులను నిల్వ చేయడానికి ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్లలోని గోడౌన్లకు తరలించేందుకు యూపీఎస్, ఫెడెక్స్తో పాటు ఇండియాలోని ఎన్జీవోలతో ఒప్పందం చేసుకున్నట్లు పటేల్ వివరించారు.
కాగా, కరోనా సెకండ్ వేవ్ కాలంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్కు అనేక విధాలుగా అండగా నిలిచారు.అయితే అమెరికాలోని ప్రవాసీ సమాజం.ఇండో-యూఎస్ సంబంధాలను ప్రభావితం చేసే బలమైన లాబీగా అవతరించిందని ఢిల్లీకి చెందని థింక్ ట్యాంక్ ఇమాజిండియా ఇన్స్స్టిట్యూట్ అధ్యక్షుడు, యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ సహ వ్యవస్థాపకుడు రాబిందర్ సచ్ దేవ్ అన్నారు.అమెరికాలో భారతీయ సమాజం గతంలో ఎన్నడూ లేనంత బలంగా, సంపన్నంగా వుందని ఆయన వ్యాఖ్యానించారు.